- సంక్రాంతి కి టీఎస్‌ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ..
- 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం.. రూ. 165.46 కోట్ల రాబడి..
- గత ఏడాది కన్నా రూ. 62.29 కోట్లు అదనం..
- టీఎస్‌ఆర్టీసీ ని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు 
- సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌


సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. సాధారణ చార్జీల తోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌ లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ. 165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ. 62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. 


కిలో మీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలో మీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలో మీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలో మీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్‌) 59.17 గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19 కి పెరిగింది.


“టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ చార్జీల తోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థ పై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతే కాదు, రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్బుతంగా పని చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అన్నారు. సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌ లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. 


సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్దతతో పని చేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీ నగర్‌, ఉప్పల్‌, ఆరాంఘర్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్‌ బయో టాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్‌ఆర్టీసీ కుటుంబం లోని ప్రతి ఒక్క సిబ్బందికి సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ గారు ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పని చేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు. 


సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్‌, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సహకరించారని గుర్తు చేశారు. ఆయా విభాగాల సమన్వయంతో పని చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చామన్నారు. టీఎస్‌ఆర్టీసీ కి సహకరించిన రవాణా, పోలీస్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కృతజ్ఞతలు తెలియ జేశారు. - పీఆర్‌వో, టీఎస్‌ఆర్టీసీ