Minister KTR: స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నేటి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు - 2023 జరగనుంది. ఈనెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ రిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ అధికారుల బృందం ఆదివారం రోజునే దావోస్ కు వెళ్లింది. ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ముఖ్య సంబంధాల అధికారి అమన్ నాథ్ రెడ్డి ఆటోమోటివ్, డిజిటల్ మీడియా, జీవశాస్త్రాల విభాగాల సంచాలకులు గోపాల కృష్ణయ్య, కొణతం దిలీప్, శక్తినాగప్పన్ లు ఈ బృందంలో ఉన్నారు. అయితే ప్రపంచ ఆర్థి వేదిక సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరు కావడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలో 2018, 2019, 2020, 2022 సంవత్సరాల్లో జరిగిన సదస్సుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ఈ సదస్సులో పాల్గొంటే ఐదోసారి అవుతుంది. ఈసారి భిన్న ప్రపంచంలో సహకారం అనే నినాదంతో సదస్సు జరుగుతోంది. ఇందులో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తారు. అనంతరం జరిగే చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. పారిశ్రామిక సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు పలు అవగాహన ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. 


ఈ సదస్సుకు దాదాపు 52 దేశాల అధినేతలు హాజరు అవుతున్నారు. 130 దేశాలకు చెందిన 27 వేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై వీరంతా చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. భారత్ నుంచి కేంద్రం మంత్రులు మన్ సుఖ్ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే, పలువురు సీఎంలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు అవుతారు. తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి అనేదే తమ నినాదం అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను వివరించి, పెట్టబడుల సమీకరణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఉన్న వాళ్లతో పోలిస్తే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 






స్విట్జర్లాండ్ లోని ప్రవాస భారతీయులతో కలిసి మంత్రి కేటీఆర్ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. దావోస్ వచ్చిన ప్రతీసారి భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అధ్భుతమైన పని తీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. విదేశాల్లో పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రవాస అభ్యర్థుల అందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.