ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడాన్ని ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ సందర్భంగా సీబీఐకి ఇచ్చిన ఆర్డర్‌పై స్టే పిటిషన్‌ విచారణకు హైకోర్టు నిరాకరించింది. డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులపై సింగిల్‌ బెంచ్‌ విచారణ చేపట్టబోదని స్పష్టం చేసింది. దీంతో, ప్రభుత్వాన్నికి మళ్లీ చుక్కెదురైంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టుకే వెళ్లాలని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. ఇక, ఈ కేసులో హైకోర్టులో ప్రభుత్వానికి తలుపులు మూసుకుపోగా, ఇక సీబీఐనే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు డిసెంబరు 26న ఆదేశాలు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని సోమవారం (ఫిబ్రవరి 6) తీర్పు చెప్పింది. మళ్లీ ప్రభుత్వం నిన్న (ఫిబ్రవరి 7) సింగిల్ బెంచ్ తీర్పుపై 3  వారాలు స్టే ఇవ్వాలని కోరుతూ  లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి నిన్న మధ్యాహ్నం విచారణ చేశారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపస్తూ అప్పీళ్లను డివిజన్ బెంచ్ కొట్టివేసిన వెంటనే తమకు ఫైల్స్ అప్పగించాలని సీఎస్‌కు సీబీఐ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారని తెలిపారు. దీన్ని బట్టి సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని అన్నారు. 


కోర్టుకు ఉన్న విశేష అధికారాలు ఉపయోగించి ఒక వారం రోజులు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏజీ కోరారు. తమకు సీబీఐ నుంచి ఒత్తిడి ఉందని తెలపగా, కోర్టు దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేవలం సుప్రీంకోర్టులో స్టే కోసం ప్రయత్నించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చాక, రివ్యూ గానీ, దానిపై స్టే గానీ ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది. 


బీజేపీ, నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు జే.ప్రభాకర్, ఎల్ రవిచందర్, మయూర్ రెడ్డిలు వాదనలు వినిపిస్తూ విచారణార్హం లేని అప్పీళ్లను కోర్టు కొట్టివేసిన తర్వాత సింగిల్ బెంచ్ వద్దకు రావడం సరికాదని అన్నారు. కేంద్రం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ డివిజన్ బెంచ్ మౌఖిక సూచనలను మేరకు ఇప్పటివరకూ ఫైల్స్ ను సీబీఐ తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విలీన సిద్ధాంతం ప్రకారం సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలు దాఖలు చేసినప్పుడు అది ఒకే కేసు అవుతుందని, అలాంటప్పుడు సింగిల్ జడ్జి వద్ద ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై సీజేని అడిగి చెప్పాలని ఏజీకి సూచిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.


తొలుత సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌లో రిట్ అప్పీలు వాదనల సందర్భంగా కొంత వెసులుబాటు కల్పించారు. రిట్ అప్పీల్ హియరింగ్ అయ్యే వరకూ, ఫైల్స్ విషయంలో ఒత్తిడి చేయొద్దని కాస్త సంయమనం పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు. ఆ వెసులుబాటు మేరకు రిట్ అప్పీలు డిస్పోజ్ అయ్యే వరకూ సీబీఐ జోక్యం చేసుకోలేదు. రిట్ అప్పీలు డిస్మిస్ అయ్యాక సింగిల్ బెంచ్ ఆదేశాలే అమలవుతాయి కాబట్టి, ఇకపై సీబీఐ జోక్యం చేసుకొనే అధికారం ఉంది.


సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. వచ్చే వారంలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టులోని సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హై కోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామన్న సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. 17వ తేదీన విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టులో తెలంగాణ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు.