సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గవర్నర్‌ రియాక్ట్ అయ్యారు. పూర్తి వివరాలు తనకు సమర్పించాలని లేఖలు రాశారు. సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. అదేటైంలో అసలు టీఎస్‌పీఎస్‌సీలో ఎంతమంది పని చేస్తున్నారు. అందులో  రెగ్యులర్‌ ఉద్యోగులు ఎవరు... ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎంతమంది వాళ్ల వివరాలు ఏంటో చెప్పాలని కూడా జనార్ధన్‌ను ఆదేశించారు. సిట్‌ దర్యాప్తు స్టాటస్‌ చెప్పాలని సిట్‌ అధికారులను కూడా ఆదేశించారు. 


ఈ మధ్యే తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్‌ తమిళిసై చాలా కీలక వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ కామెంట్స్ చేసిన ఒక్కరోజులోనే సమగ్ర నివేదిక కోరడంతో తర్వాత ఏం జరుగుతుందా ఆనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతలతో సమావేశంలోనే పేపర్ లీక్  పరిణామాలపై సీరియస్‌గా ఉన్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంకేతాలు పంపారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారం, విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నట్టు టీ-కాంగ్రెస్ నేతలతో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని అంత ఈజీగా వదిలిపెట్టలేమంటూ కామెంట్ చేశారని కూడా హస్తం నేతలు చెప్పారు. 


కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు పేపర్ లీకేజీపై గవర్నర్‌ సీరియస్‌గా ఉంటే తర్వాత ఏం చేస్తారు. ఈ వ్యవహారంలో ఆమెకు ఉన్న అధికారాలు ఏంటీ అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వానికి గవర్నర్‌కు పొసగడం లేదు. చాలా కాలంగా రెండు వ్యవస్థల మధ్య వార్ నడుస్తోంది. చాలా కీలకమైన బిల్లులు గవర్నర్ పెండింగ్‌లో పెట్టుకొని క్లియర్ చేయడం లేదని ఏకంగా కోర్టునే ఆశ్రయించింది ప్రభుత్వం. ఇది ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ మధ్య దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కేసు విచారణ వాయిదా వేసింది. 


బిల్లుల క్లియరెన్స్‌పై వివాదం నడుస్తుండగానే ఇప్పుడు గవర్నర్‌ తన దృష్టిని టీఎస్‌పీఎస్సీ పెట్టారు. ఏం జరుగుతోంద తనకు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమె చేయబోతున్నారనేది కీలకంగా మారునుంది. 


మరో ఇద్దరు అరెస్టు


గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ఉద్యోగులపై జాబితాను తీసిన సిట్... వారి మార్కులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్పీ ఉద్యోగుల్లో మరో ఇద్దరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం సాధించిన షమీమ్‌కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127 మార్కులు, టీఎస్పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. పేపర్ల లీకేజీ కేసులో A2 నిందితుడు రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్ పొందినట్లు షమీమ్‌ ఒప్పుకున్నాడు. అందుకు తాను డబ్బులు చెల్లించలేదని తెలిపాడు.  


ఫోన్ డేటా ఆధారంగా 


పేపర్ల లీకేజీలో మరో కోణం వెలుగు చూస్తుంది. నిందితుల సెల్ ఫోన్లలోని డేటా, వాట్సప్‌ చాట్, గ్రూపుల ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ సమాచారంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తయారుచేసేందుకు సిట్ ప్రణాళిక సిద్ధం చేసింది. టీఎస్పీఎస్సీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులు... గత అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఉద్యోగులు 100కు పైగా మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం సేకరణలో పడింది సిట్‌ బృందం.