Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సోమవారం(జులై 3వ తేదీ) నాడు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను గవర్నర్ పరిశీలించారు. ఆస్పత్రిలో ఆవరణలోని మరుగుదొడ్డి వద్దకు వెళ్లిన తమిళిసై.. అక్కడ వచ్చే దుర్గంధానికి ముక్కు మూసుకున్నారు. అనంతరం అక్కడే విధులు నిర్వర్తించే సిబ్బందితో మాట్లాడుతూ.. ఇక్కడ ఎలా ఉంటున్నారంటూ ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై.. ఉస్మానియా ఆస్పత్రి పరిశీలనకు వచ్చి రోగులు పడుతున్న ఇబ్బందుల గురించి వారినే అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. కాగా, రాష్ట్ర గవర్నర్ ఉస్మానియా ఆస్పత్రి తనిఖీకి వచ్చినప్పుడు ఆస్పత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 


ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గవర్నర్ ట్విట్టర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలంటూ 'జస్టిస్ ఫర్ OGH' పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా పోస్టును గవర్నర్ రీట్వీట్ చేశారు. 


గవర్నర్ vs గవర్నమెంట్


'జస్టిస్ ఫర్ OGH' చేసిన ట్వీట్ ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రీట్వీట్ చేస్తూ ఆస్పత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గవర్నర్ తమిళిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా దుస్థితి చూడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆస్పత్రి అంశం కోర్టు పరిధిలో ఉండటం వల్లే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రిని తనిఖీ చేయడం కీలకంగా మారింది. గవర్నర్ పర్యటన వేళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ వైపు గవర్నర్ పరిశీలన సాగుతున్న సమయంలోనే.. మరోవైపు మంత్రి హరీశ్ రావు ఉస్మానియా వైద్యాధికారులతో సచివాలయంలో సమీక్షిస్తున్నారు.


Also Read: Viral News: పగబట్టిన పాము! ఒక్కసారి కాటు వేస్తే చనిపోలేదని, రెండోసారి ఏం చేసిందంటే?


ఉద్ధృతంగా పోస్టు ఉద్యమం


ఇలా ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మాణంపై గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వాడి వేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ జస్టిస్ ఫర్ OGH పేరుతో ఇండియన్ పోస్టు ద్వారా 8 వందల లేఖలతో ఉద్యమం సాగుతోంది. సీఎం కార్యాలయం చిరునామాతో 4 వందల లేఖలను పోస్టు చేశారు. మరో 4 వందల లేఖలను చీఫ్ జస్టిస్ హైకోర్టు చిరునామాతో పోస్టు చేశారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial