కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా రూ.75 వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారని అన్నారు.


‘‘కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ప్రజలు ఓట్లు వేయరు. 69 లక్షల మంది రైతులు కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నారు. రైతు బంధు తరహాలోనే పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే కబర్ధార్ అని హెచ్చరిస్తున్నా. డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నాము. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. కర్ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్ లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నాం. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది.


రైతుబందు పొందిన 69 లక్షల రైతులు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడతారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బందు కేసీఆర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీ వస్టే రైతు బంధుకు రాం రాం చెబుతారు. కేవలం మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తారు. 11సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదు. మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చాము. ఒక నెల రోజులు కాంగ్రెస్ కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేం అధికారంలోకి రాగానే ఇస్తాం. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాం’’ అని అన్నారు.