సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీని వీడుతున్న వేళ.. ఆయన్ను ఆపేందుకు బుజ్జగింపులు మొదలయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో మాత్రమే కాకుండా ఏఐసీసీ స్థాయిలో నేతలు ఆయనకు ఫోన్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత అయిన వి.హనుమంతరావు హైదరాబాద్‌లోని జగ్గారెడ్డి ఇంట్లో ఆయన్ను కలిశారు. కాంగ్రెస్‌ పార్టీని వదలవద్దని జగ్గారెడ్డిని వీహెచ్‌ కోరారు. పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా జరిగే అన్యాయాలపై పోరాడాలని సూచించారు. అక్కడే మీడియా ప్రతినిధులు కూడా ఉండడంతో వారు ఒకరి చెవిలో మరొకరు కాసేపు గుసగుసలాడుకున్నారు. అయితే, మరోసారి కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం మళ్లీ వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు. 


వీహెచ్, జగ్గారెడ్డి మాట్లాడుకుంటుండగా.. మరో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కాళ్లపై పడ్డారు. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి అయిన బొల్లి కిషన్‌, జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని చాలా సేపు బతిమాలారు. మరోసారి ఆయన మోకాళ్లు పట్టుకొని పార్టీని వీడవద్దని కోరారు. ఇలా ఆయన కాళ్లు పట్టుకొని మరీ అంతలా ప్రాధేయపడడం ఆసక్తిని కలిగించింది.


జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్‌ అన్నారు. తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లుగా తమ ఫొటోలు మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. ఆ ఫోటోలను తన ఫోన్‌లో మీడియా ప్రతినిధులకు చూపించారు. తాము టీఆర్ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నామని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలా కోవర్టులుగా తమను అభివర్ణించడం బాధ కలిగిస్తోందని అన్నారు. ఇలా చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌ చెప్పారు. ఈ సందర్భంగా వీహెచ్‌ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.


పార్టీ వీడడం గురించి జగ్గారెడ్డి శుక్రవారం (ఫిబ్రవరి 18) మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సొంత పార్టీలోనే కొందరు వ్యక్తులు కుట్రలు చేశారని ఆవేదన చెందారు. తాను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారని వాపోయారు. ఆ బాధ తట్టుకోలేకే పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా జగ్గారెడ్డి నిన్న మీడియాతో అన్నారు. నేడు (ఫిబ్రవరి 19) రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి ఇస్తానని, తదుపరి కార్యాచరణ గురించి త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.


సాయంత్రానికి చాలా మంది కీలక కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, ఆయన భాార్యతో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. చివరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ శైలజానాథ్‌ కూడా జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. రాహుల్ ప్రధాని అయ్యేందుకు పని చేయాలని సూంచారు.