తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్ రావ్ ఠాక్రే నియమితులయ్యారు. మాణిగం ఠాగూర్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. అదే విధంగా మాణిగం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్ ఇంచార్జ్ గా నియమించారు. తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ ఐఏసీసీ ఇంచార్జ్‌గా దినేష్ గుండు రావు కొనసాగుతారని ఓ ప్రకటనలో ఏఐసీసీ వెల్లడించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మాణిగం ఠాకూర్ సేవలను, గోవా ఏఐసీసీ ఇంచార్జ్ గా దినేష్ గుండు రావు సేవలు ప్రశంసనీయమని కేసీ వేణుగోపాల్ అన్నారు.


తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. టీ కాంగ్రెస్‌కు సంబంధిచిన అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి ఆయన వైదొలగడంతో ఒక్క సారిగా కలకలం బయలు దేరింది. తెలంగాణ కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేసినప్పటికీ సీనియర్లు ఎవరూ హాజరు కాలేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలతో తాను వేగలేనని ఆయన బాధ్యతల నుంచి వైదొలికినట్లుగా తెలుస్తోంది. మాణిగం ఠాగూర్ బాధ్యతల నుంచి వైదొలిగారని... నాలుగైదు రోజుల తర్వాత  హైకమాండ్ కొత్త ఇంచార్జ్ ను ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ గంటల వ్యవధిలో తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను మహారాష్ట్రకు చెందిన పార్టీ నేత మాణిక్ రావ్ ఠాక్రేకు అప్పగించింది.


ఠాగూర్‌పై సీనియర్ల తీవ్ర ఆరోపణలు
తమిళనాడుకు చెందిన ఎంపీ అయిన మాణిగం ఠాగూర్ తెలంగాణకు ఇంచార్జ్ గా వచ్చినప్పటి నుండి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో కోమిటరెడ్డి వెంకటరెడ్డి ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. డబ్బులు తీసుకుని పదవి వచ్చేలా చేశారన్నారు. ఆ తర్వాత కూడా పలువురు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారని.. సీనియర్లను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చేశారు. అయితే మాణిగం ఠాగూర్ మాత్రం పార్టీ అంతర్గత విషయాలపై ఎప్పుడూ బయట మాట్లాడలేదు. 


ఇటీవల కొంత మంది సీనియర్లు.. తెలంగా ణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కన్నా, బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయాన్ని మాణిగం ఠాగూర్ వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే  బీఆర్ఎస్‌తో వెళ్లడం అంటే.. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దని  ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా సీనియర్లకు తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా సీనియర్లు మరింత అసంతృప్తికి లోనయ్యారని.. వారంతా  రేవంత్ ను, ఠాగూర్ ను టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. చాలా కాలంగా ఈ గ్రూపు గొడవలను భరిస్తున్నానని ఇక ముందు తాను భరించలేనని.. రాహుల్ గాంధీకి మాణిగం ఠాగూర్ తేల్చి చెప్పారని అంటున్నారు. 


సీనియర్లు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే వారిపై ముందుగానే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అందుకే దిగ్విజయ్ సింగ్ ను పంపి.. సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే తాము టీ పీసీసీ నిర్వహించే కార్యక్రమాలను వెళ్లబోమని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వవొద్దని ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకునేలా చాన్స్ ఇస్తే చాలని సీనియర్లు అంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.