TG Government Schools | హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్న క్రమంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులను నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.
గవర్నమెంట్ స్కూళ్లలో పెరుగుతున్న విద్యార్థులు
ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 48 వేల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అందుకు అనుగుణంగా పాఠశాలల్లో వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇంటర్లో ఎందుకు తగ్గుతున్నారని చర్చ
పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, అనంతరం ఇంటర్మీడియట్లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్ చదివేందుకు జూనియర్ కాలేజీలలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు అని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. స్కిల్డ్ కోర్సులు నేర్చుకుంటే వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మహిళలకు విముక్తి కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళల కోసం సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
నైపుణ్యాల కోసం స్కిల్ యూనివర్సిటీ
యువతలో నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రొఫెషనల్ కోర్సులు పూర్తయ్యాక సైతం ఉద్యోగాలు రాకపోవడానికి సరైన స్కిల్స్ లేకపోవడం కూడా ఓ కారణమని రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలతో తరగతి గదులతో పాటు హాస్టల్స్ లో సౌకర్యాలపై తనిఖీ చేసే బాధ్యతను అడిషనల్ కలెక్టర్లు, ఉన్నతాధికారులకు అప్పగించారు.
Also Read: Kavitha : ఎమ్మెల్సీ కవిత దూకుడు; బీఆర్ఎస్ను ఆహ్వానిస్తారా? రైలు రోకోపై కేసీఆర్, కేటీఆర్ స్పందన ఎలా ఉండబోతుంది?