Telangana Latest News: PMకు తెలంగాణ CM ఏం వినతులు చేశారు? రేవంత్కు మోదీ చేసిన సూచన ఏంటి?
Telangana CM Revanth Reddy Latest News: మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2సహా పలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని కలిసి రిక్వస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth Reddy Met With PM Modi : ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై విన్నపాలు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్తోపాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II, ఆర్ఆర్ఆర్ సౌత్పార్ట్, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఇలా చాలా వాటికి నిధుల కోసం రిక్వస్ట్ చేశారు.
మెట్రో రైలు సౌకర్యం హైదరాబాద్లో అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రికి రేవంత్ రిక్వస్ట్ చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి పెట్టాలేదని పీఎం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన అయిదు కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తి అయిందని ప్రధానికి తెలిపారు. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలన్నారు. ఉత్తర భాగంతోపాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రికి తెలియజేశారు. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎం మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో కనెక్టవిటీ సులభమవుతుందని తెలియజేశారు. రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని గుర్తు చేశారు. ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
హైదరాబాద్ మధ్య నుంచి మూసీ ప్రవహిస్తోందని.. అందుకే ఆ నది పునరుజ్జీవనానికి సహకరించాలని మోదీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని అభ్యర్థించారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కోరారు.
రేవంత్ చెప్పినవి శ్రద్ధా విన్న ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న లిస్ట్ గుర్తు చేశారు. 2017 నుంచి 2022 వరకు చాలా అనుమతులు క్లియరెన్స్ కాలేదని తెలిపారు. వాటిని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని సూచించారు.
ప్రధాని లేవనెత్తిన అంశాలు ఇవే
ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పథకం తెలంగాణలో అమలు కావడం లేదని తెలిపారు. దీని కోసం మార్చి 31 లోపు సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలని సీఎంకు ప్రధానమంత్రి సూచించారు.
శంషాబాద్లో ఏర్పాటు చేయబోతున్న ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టవిటీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని వాటి పూర్తి కోసం ఆదేశాలు ఇవ్వాలని సజెస్ట్ చేశారు. బీబీనగర్ ఎయిమ్స్కు విద్యుత్, నీటి సప్లై కోసం 1365.95కోట్లు చెల్లించాలని విన్నవించారు.
తెలంగాణలో రెండు రైలు ప్రాజెక్టులకు అటవీ శాఖ అనుమతులు ఇంకా లభించలేదని వాటిని క్లియర్ చేయాలని చెప్పారు. ఇంకా మూడు నీటి పారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని వాటి సవరించిన అంచనాలు పంపించాలని సూచించారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రికి రేవంత్ హామీ ఇచ్చారు.
Also Read: ప్రధాని మోదీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చ