తెలంగాణ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు రిజర్వాయర్లు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితులను సమీక్షించుకొని తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భారీ వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సిఎం  ఆదేశించారు.
 
రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్ బుధవారం కూడా ప్రగతి భవన్‌లో వానలు వరదల పరిస్థితులపై  ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు ఆరు గంటలపాటు కొనసాగింది. 


సిఎం కెసిఆర్ ఆరా :
ఎగువన కురుస్తున్న భారీ వానలకు కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్సారెస్పీ వంటి రిజర్వాయర్ల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల ఎలా ఉందనేది సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ కొన్ని సూచనలు కూడా చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.  మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన ముందస్తు చర్యల గురించి కూడా వాకాబు చేశారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలు గురించి కూడా తెలుసుకున్నారు. 


కడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల తరలింపు :
కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్నందున కడెం ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదల చేస్తున్నకారణంగా ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించినట్టు అధికారులు తెలిపారు. అక్కడే ఉండి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిర్మల్ సహా వరద ముంపుకు గురౌతున్న నదీ పరివాహక ప్రాంత పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు సూచించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సిఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు సిఎం ఆదేశాలిచ్చారు. 


భద్రాచలంలో రక్షణ చర్యలు చేపట్టండి :
భద్రాచలంలో వరద ఉద్ధృతి పెరుగుతున్న వేళ అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని  స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణలో పంటల పరిస్థితిని, చెరువులకు గండ్లపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో సిఎం కెసిఆర్ మాట్లాడారు. వరదలు తగ్గిన వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు రాకుండా చర్యలు:
రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్  ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సిఎండీ లు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండీ శ్రీధర్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్థంభాలు కూలిపోతే 1600  వరకు పునరుద్దరణ చేపట్టామని, మిగతా పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు సిఎంకు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్ధరిస్తున్నట్టు సిఎండీలు సిఎం కేసీఆర్‌కు వివరించారు.


ప్రాజెక్టులకు విపరీతంగా వరద వస్తున్న ప్రాంతాల్లో అవకాశమున్న చోటల్లా  హైడల్ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిఎం అన్నారు. వరదల వల్ల దేవాదుల ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడినట్టు అధికారులు సిఎం కు తెలిపారు. వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కెసిఆర్ ఆదేశించారు.


వానలు, వరదల్లో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిఎస్, డిజిపిలను సిఎం ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్పితే  బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు.