Telangana New CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను తెలంగాణ సీఎస్ శాంతి కుమారి పరిశీలించారు. ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతి కుమారి దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ రవి గుప్తా, అడిషనల్ డీజిలు సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, రిజ్వి, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనల్డ్ రాస్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, రాజ్ భవన్ కార్యదర్శి సురేంద్రమోహన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మున్సీ తదితరులు హాజరయ్యారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లలో ఏ లోపాలు ఉండకూడదని సీఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు, స్టేడియంలో మంచి నీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వాహనాల పార్కింగ్, బందోబస్త్ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.