చలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోయారు. ఈ ఉదయం నుంచి ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డిని ఎయిర్పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసేందుకు బీజేపీ నేతలు చలో బాటసింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని అప్రమత్తమైన పోలీసులు బీజేపీ లీడర్లను అరెస్టు చేస్తున్నారు.
శంషాబాద్లో కిషన్ రెడ్డిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. జోరు వానలోనే రోడ్డుపై బైఠాచింయారు. కిషన్ రెడ్డితోపాటు ఉన్న ఎమ్మెల్యేరఘునందన్రావు.
కిషన్ రెడ్డి, రఘునందన్రావు మినహా మిగిలిన వారిని పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. బాటసింగారం తీసుకెళ్లాలని పోలీసులను బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కాన్వాయ్నే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. తానేమీ టెర్రరిస్టును కాదని అన్నారు. నిరసన తెలిపే హక్కు తనకు ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
నాటకీయ పరిణామాలతో చివరకు కిషన్ రెడ్డిని ఒప్పించి ధర్నా చేస్తున్నప్రదేశం నుంచి తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్లి ఆయన కాన్వాయ్లోని వాహనంలోనే కూర్చోబెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఆయన్ని తరలించారు.
కేంద్రమంత్రి పట్ల తెలంగాణ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. కచ్చితంగా ప్రభుత్వం తీరుపై, పోలీసుల ప్రవర్తనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓ వైపు పార్లమెంట్ నడుస్తుండగానే కేంద్రమంత్రిపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా బీజేపీ అడగతం తప్పా అని నేతలు ప్రశ్నింస్తున్నారు. పరిశీలనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఉదయం ఐదు గంటల నుంచే పోవలీసలులు తమ వాహనాలను తీసుకొచ్చి ఇళ్ల చుట్టూ మోహరించారని ఆరోపించారు డీకే అరుణ.
బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించాలని బీజేపీ నిర్ణయిస్తే జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఈటల రాజేందర్. ప్రతీసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని... ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమను నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదని... కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని... అరెస్టులు కొత్తకాదని అభిప్రాయపడ్డారు.