14 Days Remand for Teenmar Mallanna: జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను మేడిపల్లి పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచ్చారు. తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 148, 307, 342, 506, 384, 109, r/w 149 కింద కేసులు నమోదు చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేశారు. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.


తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు హయత్ నగర్ మునగనూరులోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మల్లన్నతో పాటు మరో నలుగురు నిందితులను హాజరుపరచగా వారికి రెండు వారాల రిమాండ్ విధించారు న్యాయపూర్తి. సాయికరణ్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీన్మార్ మల్లన్న కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని మేడిపల్లి పోలీసులు విడుదల చేశారు. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్బంధించి దాడి చేశారని సాయికరణ్ ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన టీమ్ నలుగురిని అరెస్ట్ చేసినట్లు మేజిస్ట్రేట్ కు తెలిపారు.


తీన్మార్ మల్లన్న అరెస్ట్
జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను పోలీసులు మంగళవారం రాత్రి మరోసారి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రెండు రోజుల కిందట కొందరు గుర్తుతెలియని దుండగులు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి కార్యాలయం నుంచి తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ పోలీసులు సోదా చేశారు. ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర డివైజ్ లు తీసుకెళ్లిపోయారు. పోలీసులు వచ్చిన సమయంలో సిబ్బందిని బయటకు పంపించివేసినట్లు సమాచారం. ఎవరినీ క్యూ న్యూస్ ఆఫీసులోకి అనుమతించడం లేదు. మరోవైపు మల్లన్న అరెస్ట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చింది మఫ్తీలో ఉన్న పోలీసులు కాదని, గుర్తు తెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్నను, సుదర్శన్ ను కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు నిజంగా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు.


క్యూ న్యూస్ ఆఫీస్ పై మంత్రి అనుచరులు దాడి!


హైదారాబాద్ లోని తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీస్ పై మార్చి 19న దుండగులు దాడి చేశారు. సుమారు 25 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా క్యూ న్యూస్ ఆఫీస్ లో చొరబడి కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫిర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్ లోకి దూసుకొచ్చిన అగంతకులు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యూ న్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది.  మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమ కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న టీమ్ ఆరోపిస్తుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యూ న్యూస్ టీమ్ డిమాండ్ చేస్తోంది.