తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటే.. అది తెలుగు దేశం ప్రభుత్వం వేసిన పునాది అని చెప్పుకున్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం బాగుందని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.


ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారని చంద్రబాబు అన్నారు. టీడీపీ వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి తెలిసిందని, ఇప్పుడు తెలుగు వారు ప్రపంచం నలుమూలలా ఉన్నారంటే అది తెలుగు దేశం పార్టీ ఘనతేనని చంద్రబాబు అన్నారు. అప్పట్లో తాను ఐటీ అభివృధ్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి ప్రతి అడుగులో టీడీపీ వేసి ముద్ర ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుందని చెప్పారు. ప్రతి తెలుగువాడిని సంపన్నుడిని చేయడమే టీడీపీ లక్ష్యం అని చంద్రబాబు చెప్పారు. 


దేశంలోని వంద ప్రధాన నగరాల్లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు. మరోసారి తనను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తాను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చానని చెప్పారు. చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, పలువు సీనియర్‌ నేతలు ఘన స్వాగతం పలికారు.


ఘన స్వాగతం అనంతరం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. దీంతో పొత్తు వార్తలకు మరింత బలం వచ్చినట్లు అయింది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు సహా తెలంగాణలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.


మూడు రోజుల క్రితమే ఢిల్లీకి చంద్రబాబు


గత శనివారం (జూన్ 3) ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో మొదలైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించారు. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పొత్తుల విషయంపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారని ఏపీలో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించడంతో పాటు పాత మిత్రులను తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.