Hyderabad News: హైదరాబాద్‌లో కుక్కల దాడులు నిత్యకృత్యమైపోయాయి. రోజూ ఏదో ప్రాంతంలో కుక్కల దాడులు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో చిన్నారి ప్రాణం తీశాయి కుక్కలు. పాలకులు మారినా, కొత్త అధికారులు పగ్గాలు చెపడుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండటం లేదు. 


హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఇంటిబయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. మంగళవారం రాత్రి విహాన్ అనే బాలుడు ఇంటి బయట ఆడుకున్న టైంలో కుక్కలు దాడి చేశాయి. విచక్షణరహితంగా పట్టి పీకేశాయి. స్థానికులు స్పందించి కుక్కలను తరిమేశారు. ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 


గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విహాన్ పరిస్థితి విషమించింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా పిల్లాడిని బతికించలేకపోయారు. ఈ ఉదయాన్ని ఆ బాలుడు చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. 


ఎంతో ప్రేమగా పెంచుకున్న విహాన్ మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. విహాన్ లేడన్న తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఆ సీన్ చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు. 


చర్యలకు రేవంత్ ఆదేశం 


వీది కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. విహాన్ మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు రేవంత్. బవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా  పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


ఇదే కాదు ఈ మధ్య కాలంలో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని దీనిపై  ప్రత్యేక దృష్టి పెట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. వీధి కుక్కలు గురించి సమాచారం ఇచ్చేందుకు కాల్ సెంటర్ లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 


వీటితోపాటు దాడులు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై బ్లూక్రాస్ వంటి సంస్థలు, పశువైద్యు నిపుణులోత మాట్లాడాలని సూచించారు రేవంత్. ఇలాంటి టైంలో వేర్వేరు రాష్ట్రాలు ఎలాంటిజాగ్రత్తలు తీసుకుంటాన్నాయి అక్కడ ఎలాంటి విధానాలు అవలభిస్తున్నారో కూడా తెలుసుకొని వాటిలో మంచి విధానాలు అవలంభించాలన్నారు. 


కుక్క కాటుకు గురై ఆసుపత్రికి వచ్చే వాళ్లు నిరాశతో వెళ్లే పరిస్థితి ఉండకూడదని తేల్చి చెప్పారు రేవంత్. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు చికిత్స మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 


జగిత్యాలలో బాలుడికి గాయాలు 


జగిత్యాలలో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగింది. బీర్పూర్ మండలం మంగెలలో ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్ అనే ఏడేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపరిచింది. వెంటనే కుటుంబసభ్యులు దేవందర్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో బాలుడి చెవి తెగిపోయింది. 


ఓ చిన్నారిని చూసి కుక్క పరుగెత్తుకొని వచ్చింది. అయితే ఆ చిన్నారి వేరే వైపునకు పరుగెత్తింది. ఇంతలో ఓ బండిపై ఉన్న దేవందర్‌ కిందికి దిగి వెళ్లి పోసాగాడు. అంతే అక్కడే ఉన్న కుక్క దేవందర్‌పై అటాక్ చేసింది. 






దేవందర్‌ను కుక్క అటాక్ చేస్తున్న టైంలో ఇంట్లో నుంచి ఓ వృద్దురాలు పరుగెత్తుకొని వచ్చి కుక్కను తరిమేసింది. మరోవైపు నుంచి స్థానికులు కూడా వచ్చి కుక్కను పరుగెత్తించారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు.