ప్రముఖ గాయని సునీత భర్త అయిన వీరపనేని రామకృష్ణకి కొందరి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి ద్వారా తనకు ప్రాణ హాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో వీరు నివాసం ఉంటున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సినిమా నిర్మాతల కౌన్సిల్‌ సభ్యుడిని అంటూ కెకె లక్ష్మణ్‌ అనే వ్యక్తి వీరపనేని రామకృష్ణ ఫోన్‌కు ఓ మెసేజ్ పంపించాడు. తనను వ్యక్తిగతంగా కలవాలని ఆ మెసేజ్ ద్వారా కోరాడు. అపరిచిత వ్యక్తి కావడంతో ఆ వ్యక్తిని కలవడానికి రామకృష్ణ ఒప్పుకోలేదు. ఏదైనా బిజినెస్ కి సంబంధించిన విషయం అయితే, తన టీమ్‌ను కలవాలని సూచించారు. కానీ, అందుకు అవతలి వ్యక్తి ఒప్పుకోకుండా వ్యక్తిగతంగానే కలవాలని అనుకుంటున్నట్లుగా తరచూ మెసేజ్‌లు పంపుతున్నాడు. 


ఊరికే మెసేజ్‌లతో వేధిస్తుండటంతో రామకృష్ణ ఆ నంబరును బ్లాక్‌ చేశారు. అంతటితో ఊరుకోని వ్యక్తి 2023 మార్చి 28న ఇంకో కొత్త నంబరుతో మెసేజ్‌లను పంపడం ప్రారంభించాడు. ఈ సారి ఏకంగా బెదిరింపులకు దిగాడు. దీంతో రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్‌ నుంచి ప్రాణహాని ఉందని, అతణ్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ శనివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్‌ పోలీసులు కేకే లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.