YS Sharmila Health Bulletin News Updates: హైదరాబాద్: నిరహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరిన వైఎస్ షర్మిల అరోగ్య పరిస్థితి పై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లో బీపి, బలహీనత, మైకము ఉండటం తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు తెలిపారు.  ఆదివారం (డిసెంబర్ 11 వ తేదీన) తెల్లవారుజామున ఒంటి గంట తరువాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు డీహైడ్రేషన్ సమస్యతో పాటు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని వైద్యులు వెల్లడించారు. మంచినీళ్లు కూడా తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడంతో షర్మిల బాగా నీరసించిపోయారు. అయితే ఆమె ఆరోగ్యం గురంచి ఆందోళన చెందనక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు.


2, 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి.. 
వైఎస్ షర్మిలకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ కండీషన్ తో పాటు ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, ఆదివారం రాత్రిలోగా లేదా సోమవారం ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు. కానీ షర్మిల ఆరోగ్య పరిస్థితి కారణంగా 2 - 3 వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ వివరాలు ఆదివారం మధ్యాహ్నం అపోలో వైద్యులు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిని హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు.


రెండ్రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష, క్షీణించిన ఆరోగ్యం
తాను చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అరెస్టు చేసిన వైఎస్సార్ టీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష చేశారు. ఓవైపు ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దీక్ష చేపట్టిన చోటే షర్మిలను పరీక్షీంచిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. పార్టీ ఆఫీస్ కు నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీస్ లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 


వైఎస్ షర్మిలకు వైద్యులు నిన్న (డిసెంబరు 10) ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుందని వైద్యుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. బీపీ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. గ్లూకోజ్  లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. 30 గంటలుగా షర్మిల మంచి నీళ్లు సైతం తీసుకోవడం లేదన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించకపోతే ప్రాణాలకు ప్రమాదమన్నారు. మరోవైపు, పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు తన దీక్ష విరమించనని షర్మిల అన్నారు. మొత్తానికి అర్ధరాత్రి పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.


తన పాదయాత్ర 3,500 కిలోమీటర్లలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని, తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనను అడ్డుకుంటుందని షర్మిల ఆరోపించారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతి ఇచ్చినా సీఎం కేసీఆర్ అవినీతి, పరిపాలన వైఫల్యాలను, బీఆర్ఎస్ నేతల అవినీతిపై ప్రశ్నిస్తున్నాన్న కారణంగా తనను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా, ఆమెకు మద్దతుగా తల్లి వైఎస్‌ విజయలక్ష్మి దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు సుధీకర్‌ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తదితరులు షర్మిల వద్దకు వచ్చి శనివారం ఆమెను పరామర్శించారు.