వామ్మో... వాళ్లు పిల్లలు కాదు చిచ్చరపిడుగులు. స్కూల్‌కి వెళ్లి చదువుకుంటున్న వయస్సులోనే చోరీలు చేస్తున్నారు. అది కూడా వినాయకుడి ప్రసాదమైన లడ్డూనే  అపహరించేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 కేజీల లడ్డూని చోరీ చేశారు. అంతేనా... ఎత్తుకెళ్లిన లడ్డూని ఎంచక్కా గుటకాయ స్వాహా చేసేశారు. ఈ సంఘటన  హైదరాబాద్‌లోని చార్మినార్‌ పరిధిలో జరిగింది.


చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఝాన్సీ బజార్ ప్రాంతంలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా... వినాయక మండలం ఏర్పాటు చేశారు. బొజ్జగణపయ్య ప్రతిష్టించి.. 21 కేజీల  లడ్డూను వినాయకుడి చేతిలో పెట్టారు. అయితే... రోజా ఆ దారిలో స్కూల్‌కి వెళ్తూ.. వస్తున్న ఓ విద్యార్థుల గ్యాంగ్‌ కన్ను.. వినాయకుడి చేతిలోని లడ్డూ పడింది. చూడగానే  నోరూరిందో ఏమో... లడ్డూ కొట్టేదానుమనుకున్నారు. శనివారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటి వెళ్తూ... మార్గమధ్యలో ఉన్న ఆ మండపంలోకి చొరబడ్డారు. ఆ సమయంలో  మండపంలో ఎవరూ లేరో ఏమో...వినాయకుడి చేతిలోని 21 కేజీల లడ్డూను అపహరించేశారు. రోడ్డుపై అందరూ తిరుగుతూనే ఉన్నారు... అయినా ఎవరూ గమనించలేదో..  లేక మనకెందుకులే అనుకున్నారో ఏమో మరి. విద్యార్థులకు మాత్రం లడ్డూ కొట్టేసే ఛాన్స్‌ దొరికేసింది. లడ్డూ దొంగిలించగానే.. విద్యార్థుల గ్యాంగ్‌ అంతా కలిసి లడ్డూని  పంచుకుని తినేశారు.


మండపంలోని వినాయకుడి చేతిలో లడ్డూ లేదని నిర్వహకులు గమనించుకునే లోపు అంతా అయిపోయింది. లడ్డూ పోయిందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... చుట్టపక్క ఉన్న సీసీ కెమెరాలను గమనించారు. దీంతో విద్యార్థుల లడ్డూ చోరీ బాగోతం బయటపడింది. విద్యార్థులు మండపంలో ఎలా  దూరారు.. లడ్డూ ఎలా ఎత్తుకెళ్లారు.. అంతా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతుంది. లడ్డూ చోరీ చేసిన విద్యార్థులు.. దాన్ని  తినేయడంతో చేసేది ఏమీలేక వదిలేసినట్టున్నారు పోలీసులు.


హైదరాబాద్‌లో గల్లీకో వినాయక మండపం ఉంటుంది. ప్రతి వినాయకుడి చేతిలో లడ్డూ ఉంటుంది. గణేష్‌ నవరాత్రుల్లో వినాయకుడితోపాటు లడ్డూకు పూజలు చేస్తారు.  నిమజ్జనం రోజు లడ్డూను వేలం వేస్తారు. నవరాత్రుల్లో పూజలు అందుకున్న ఆ లడ్డూని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసివస్తుందని... విఘ్నాలు తొలగి.. అనుకున్నవన్నీ  నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే గణేష్‌ లడ్డూనే వేలం పాటలో అత్యధిక ధరలు పాడుకుని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌ బాలపూర్‌ వినాయకుడి  లడ్డూ ధర లక్షలు పలుకుతుంది. ఇక, వినాయకుడి చేతిలోని ఆ లడ్డూని కొట్టేసేందుకు చాలా మంది కాచుకుని కుర్చోనుంటారు. గణష్‌ లడ్డూని దొంగతనం చేసి తిన్నా  అదృష్టం కలిసివస్తుందని కొందరి నమ్మకం. అందుకే.. వినాయక మండపాల దగ్గర లడ్డూ చోరీ జరగకుండా... ఎవరో ఒకరు కాపలాగా ఉంటారు. వినాయకుడిని  ప్రతిష్టించిన రోజు నుంచి నిమజ్జనం వరకు లడ్డూ ప్రసాదాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటారు. ఇక... హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహానిమజ్జనానికి కూడా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గురువారం.. భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనోత్సం ఘనంగా జరగబోతోంది. పోలీసులు, అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గట్టి బందోబస్తు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.