Road Accident: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని రంగారెడ్డిలో డీసీఎం సిమెంట్ లారీ ఢీకొనగా నలుగురు దుర్మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొట్టుకోగా ముగ్గురు మృతి చెందారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు విడిచారు. 


సిమెంట్‌ లారీ ఢీ కొని నలుగురు మృతి 


రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ కూడలి వద్ద.. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. వారి వివరాలు మాత్రం తెలియరాలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 


తూర్పు గోదావరిలో ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు


మరోవైపు ఆంద్ధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతున్నారు. అయితే కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి, పక్క వైపు నుంచి వెళ్తున్న మెడికల్ వ్యాన్, కంటైనర్ ను ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. ఈక్రమంలోనే కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


నిన్నటికి నిన్న దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం



తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొందరు, కర్ణాటకలోని బళ్లారికి చెందిన మరికొందరు మొత్తం 14 మంది తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. దర్శనం చేసి తుఫాన్ వాహనంలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కడప తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో ప్రమాం జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని  లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారు. గాయపడ్డ ఐదుగుర్ని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఆదివారం రోజు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనంతరం తిరిగి తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద అదుపు తప్పిన తుఫాన్ వాహనం ఆంజనేయ స్వామి వారిని మొక్కుతున్న మెదక్ కు చెందిన పార్వతమ్మను ఢీ కొని, ప్రక్కనే ఉన్న పిట్ట గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన స్ధలంలోనే పార్వతమ్మ మృతి చెందగా, తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా రాయదుర్గానికి చెందిన రేణుకమ్మ మృతి చేందింది. మరో ఐదుగురు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.