Top Headlines Today: 


నేడు మత్స్యకార భరోసా నిధులు విడుదల 
వేట నిషేధ టైంలో జాలరి కుటుంబాల పోషణ కోసం ఇచ్చే మత్స్యకార భరోసా నిధులను ఇవాళ సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈసారి 1,23,519 కుటుంబాలకు లబ్ధిచేకూరేలా 123.52 కోట్లరూపాయల నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 15 నుంజి జూన్ 14 కాలంలో ఏటా చేపల వేటను నిషేధిస్తారు. ఆ టైంలో ఆయా కుటుంబాల పోషణ కోసం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఇస్తుంది. దీంతోపాటు ఓఎన్జీసీ పైప్‌ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 కుటుంబాలకు 231 కోట్ల రూపాయలను ఇవ్వనున్నారు. బాపట్లలోని నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నరాు. 



నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
వివేక హత్య కేసులో ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనపై సీబీఐ పలు అభియోగాలు మోపుతూ కోర్టులో పిటిషన్లు వేసింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు హాజరుకావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కోఠీ సీబీఐ కార్యాలయంలో విచారణ అధికారుల ముందుకు అవినాష్ రెడ్డి రానున్నారు. 


నేడు ఇంటర్‌ రీవెరిఫికేషన్ ఫలితాలు 
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నారు. ఇంటర్‌ విద్యాశాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఈ ఫలితాలు విడుదల చేస్తారు. బోర్డు వెబ్‌సైట్‌లో రోల్‌ నెంబర్‌, పుట్టిన తేదీ, రశీదు నెంబర్‌ నమోదు చేస్తే ఫలితాలు వస్తాయి. వీళ్లంతా జవాబు పత్రాలను డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఎదురైనా 18004257635ను సంప్రదించి పరిష్కరించుకోవచ్చు. 


కట్టుదిట్టంగా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష
పకడ్బంధీగా ఏవో పరీక్షను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. ఉదయం 10 గంటలన నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌ వన్‌, మధ్యాహ్నం 2.30 నుంచి ఐదు గంటల వరకు రెండో పేపర్‌ రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ బేస్ట్ రిక్రూట్మెంట్‌ టెస్ట్ విధానంలో దీన్ని నిర్వహిస్తున్నారు. 148 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరుగుతుంది. 


నేడు ఈ-గరుడ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌ విజయవాడ రూట్‌లో 10 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఇవాళ టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. మియాపూర్‌ నుంచి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. క్రమంగా ఈ బస్సుల సంఖ్యను 50కి పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. హైటెక్‌ హంగులతో వీటిని తీర్చి దిద్దారు. ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉండేలా షెడ్యూల్ చేశారు. రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్కిక్ బస్సుల రోడ్లపైకి తీసుకొస్తామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 


గౌడ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో నిర్మించిన గౌడ హాస్టల్ భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌, గౌడ హాస్టల్‌ ప్రెసిడెంట్‌ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ పాల్గోనున్నాుర. హిమాయత్‌నగర్‌లో ఉన్న హాస్టల్ భవన్ సరిపోవడం లేదన్న ఫిర్యాదులతో ఈ సరికొత్త భవనాన్ని నిర్మించారు. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


PVR ఐనాక్స్: మల్టీప్లెక్స్ చైన్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రెండింతలు పెరిగి రూ. 1,143 కోట్లకు చేరుకుంది.


కళ్యాణ్ జ్యువెలర్స్: 2022-23 నాలుగో త్రైమాసికంలో కళ్యాణ్ జ్యువెలర్స్ నికర లాభం రూ. 70 కోట్లుగా లెక్క తేలింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 72 కోట్లతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది.


ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌: Q4FY23లో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్వతంత్ర నికర లాభం 84% పెరిగి రూ. 251 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 136 కోట్లుగా ఉంది.


ఫైజర్ ఇండియా: 2023 జనవరి-మార్చి కాలానికి ఫైజర్ ఇండియా నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 130 కోట్లకు చేరుకుంది, క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 126 కోట్లుగా ఉంది.


ప్రోక్టర్ & గాంబుల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 59 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 20% పెరిగింది.


సూర్యోదయ్ SFB: నాలుగో త్రైమాసికానికి రూ. 39 కోట్ల నికర లాభాన్ని సూర్యోదయ్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఆర్జించింది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48 కోట్ల నష్టం వచ్చింది. రిపోర్టింగ్ కాలంలో నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 210 కోట్లుగా లెక్క తేలింది.


NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) స్వతంత్ర నికర లాభం మార్చి త్రైమాసికంలో 19% వార్షిక వృద్ధితో (YoY) రూ. 1,810 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీ 32% వృద్ధితో రూ. 3,295 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ప్రకటించింది. 


ఆస్ట్రల్: జనవరి-మార్చి కాలంలో ఆస్ట్రల్ రూ. 206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 141 కోట్ల లాభం నుంచి బాగా మెరుగుపడింది. ఈ త్రైమాసికంలో ఆదాయం దాదాపు 8% పెరిగి రూ.1,506 కోట్లకు చేరుకుంది.


కోరమాండల్ ఇంటర్నేషనల్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 246 కోట్ల నికర లాభాన్ని కోరమాండల్ ఇంటర్నేషనల్ మిగుల్చుకుంది. నాలుగో త్రైమాసికంలో ఈ సంస్థ ఆదాయం రూ. 5,476 కోట్లుగా ఉంది.


ఉత్తమ్ షుగర్ మిల్స్: ఉత్తమ్ షుగర్ మిల్స్ నికర లాభం మార్చి త్రైమాసికంలో 15% పెరిగి రూ. 70 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 61 కోట్లుగా ఉంది. సమీక్ష కాలంలో రూ. 527 కోట్ల ఆదాయం వచ్చింది.