Renuka Chowdary on BJP: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని ప్రశ్నించారు. వారికి తెలంగాణ తడాఖా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో గాంధీ భవన్ కు వచ్చేందుకు ఢిల్లీ పోలీసులకు ఏం హక్కు ఉందని నిలదీశారు. బీజేపీ కక్ష సాధింపు చేస్తోందని.. వారికి దమ్ముంటే తమ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్నను పట్టుకోవాలని సవాలు చేశారు. సోమవారం (మే 6) గాంధీ భవన్ లో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు.


‘‘ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం. ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్నని పట్టుకోండి. నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ పారిపోయినట్టే రేవణ్న పారిపోయాడు. ప్రజ్వల్ ని బలపరిస్తే నన్ను బలపర్చినట్టే అని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు సైలెంట్ గా ఉంటున్నారు. బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేస్తే మళ్ళీ టికెట్ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల గురించి ప్రజలందరికి తెలిసిందే. దేశ ప్రతిష్ఠ కోసం మెడల్స్ సంపాదిస్తున్న మహిళా రెజ్లర్లను వేధించిన బ్రిజ్ భూషణ్ కు టికెట్ నిరాకరించినట్లే నిరాకరించి దొడ్డిదారిలో మళ్లీ ఆయన కుమారుడికే టికెట్ ఇచ్చారు.


దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ మాట్లాడడం లేదు. ముస్లింల గురించి మోదీ అహంకారం, అధికార దాహంతో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కొంత మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్ కి వస్తున్నారు. జవాన్లు, రైతులు అనే రెండు పెద్ద సెక్యులర్ ఫోర్సెస్ దేశంలో ఉన్నాయి. మోదీకి పెద్ద ఛాతీ ఉండడం కాదు. దానిలో గుండె, మనసు కూడా ఉండాలి’’ అని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు.