మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటు పోయినా ఫర్వాలేదని.. కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను బుధవారం (సెప్టెంబర్ 20) మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మన జీవితాలు చాలా చిన్నవని, మహిళా బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో తన పాత్ర తాను పోషించానని అన్నారు.


ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహా నగరం చేరుకుందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని మంత్రి అన్నారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే సరఫరా అవుతున్నాయని అన్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు తాము అండగా నిలబడతామని భరోసా కల్పించారు. హైదరాబాద్‌ లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా మారుతుందని అన్నారు. హైదరాబాద్‌ చాలా అందమైన నగరం అని, ఇక్కడ టాలెంట్‌కు కొదవ లేదని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువే అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.