హైదరాబాద్‌ నగర శివారు మేడ్చల్‌ మల్కాజిగిరి (Medchal Malkajgiri) జిల్లాలోని పోచారం, గాజులరామారం టౌన్‌ షిప్‌ల పరిధిలో (Rajiv Swagruha Apartment) పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్‌ స్వగృహ టవర్లను ఉన్నవి ఉన్నట్లుగా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని విక్రయించే బాధ్యతలను హెచ్‌ఎండీఏ - HMDA (హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కి అప్పగించింది. ఈ మేరకు ఇప్పటికే హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిలో భాగంగా నేడు (జనవరి 9) హెచ్‌ఎండీఏ, రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ప్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు హిమాయత్‌ నగర్‌ ఉర్దూ గల్లీలో ఉన్న రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ (Rajiv Swagruha Corporation) కార్యాలయ మీటింగ్‌ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని హెచ్‌ఎండీఏ (HMDA) అధికారులు వెల్లడించారు.


డీడీ చెల్లింపునకు లాస్ట్ డేట్ ఈ నెల 30


పోచారంలో (Pocharam Rajiv Swagruha Apartment) 9 అంతస్తులతో కూడిన 4 టవర్లు ఉండగా, వాటిల్లో ఒకొక టవర్‌లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదే విధంగా గాజుల రామారంలో (Gajularamaram Rajiv Swagruha Apartment) 14 అంతస్తులతో 5 టవర్లు ఉండగా వాటిల్లో ఒకొక టవర్‌లో 112 ఫ్లాటను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు జనవరి 30వ నాటికి రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ధరావత్తు చెల్లించిన దరఖాస్తు దారులను లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి టవర్లను కేటాయిస్తారు. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార వర్గాలు సోమవారం (జనవరి 9) జరిగే ప్రీ బిడ్‌ సమావేశానికి హాజరై ఇతర వివరాలకు సంప్రదించవచ్చని తెలిపారు.