మీర్ పేట్ మైనర్ బాలికపై హత్యాచారం కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఓ నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడ్ని అరెస్ట్ చేస్తామన్నారు. ముగ్గురు నిందితులు బాలికపై అత్యాచారం చేయగా, మరో నలుగురు బయట కాపలాగా ఉన్నారని వెల్లడించారు. బాలిక ప్రతిఘటించే ప్రయత్నం చేయగా నిందితులు ఆమెపై దాడి చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 1211/2023 U/s 452, 324, 376-DA, 506,  పోక్సో యాక్ట్ 5(g)r/w 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


రాచకొండ సీపీ చౌహాన్ మంగళవారం మీడియాకు కేసు వివరాలు తెలిపారు. హైదరాబాద్ లోని లాల్ బజార్ కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. రెండు వారాల కిందట సోదరుడు (14)తో కలిసి మీర్ పేట లోని నందనవనం కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర వీరు ఉంటున్నారు. బాధితురాలు దిల్ సుఖ్ నగర్ లోని ఓ క్లాత్ స్టోర్ లో పనిచేస్తోంది. బాలుడు ఫ్లెక్సీల పని చేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం  కొందరు నిందితులు వీరి ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే వీరు గంజాయి మత్తులో ఉన్నారు. 
నలుగురు నిందితులు బాలిక మెడపై కత్తి పెట్టారు. బిల్డింగ్ లోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తమ్ముడితో పాటు మిగతా చిన్నారుల్ని మిగతా నిందితులు అదే గదిలో బంధించారు.  నిందితుల్లో ముగ్గురు కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడినుంచి వెళ్లిపోగా, బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత బాలికను  వైద్య పరీక్షల అనంతరం ఆమెను సఖి కేంద్రానికి తరలించారు. నిందితులలో ఆరుగుర్ని అరెస్ట్ చేశామని, మరో నిందితుడ్ని త్వరలోనే  అదుపులోకి తీసుకుంటామన్నారు.


ప్రధాన నిందితుడు రౌడీ షీటర్..
మొత్తం ఏడుగురు నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్‌ 5జీ రెడ్‌విత్‌ 6 కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ డీఎస్ చౌహాన్ చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్‌లో రౌడీషీటర్‌. అతడిపై కేసులున్నాయి. ముగ్గురు నిందితులు అష్రఫ్‌ తహిసీన్‌, చిన్నా, మహేశ్‌ బాలికలపై అత్యాచారాని పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్‌, ఇమ్రాన్‌ వద్దకు వెళ్లి కలిశారు. వారి మొబైల్స్ తీసుకుని కొన్ని కాల్స్ చేసి అనంతరం ఆ వివరాలు డిలీట్ చేశారు. అక్కడి నుంచి నిందితులు ఉమ్నాబాద్‌ వరకు వెళ్లారు.
మొత్తం 12 బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఉమ్నాబాద్ లో రెండు పోలీస్ టీమ్స్ గస్తీ ఉండటంతో భయపడి తిరిగి వెనక్కి వచ్చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీపీ చౌహాన్ వివరించారు.


గ్యాంగ్‌రేప్ పై తమిళిసై దిగ్భ్రాంతి 
బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ కి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.