Pharmacist: భార్యను, ఆమె కుటుంబసభ్యులను చంపాలని ప్రయత్నించి.. అత్తను చంపిన యూకే ఫార్మసిస్టు కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అత్తింటి వారికి ఆర్సెనిక్ ఇచ్చేందుకు ముందు నిందితుడు అజిత్ కుమార్ మరో పథకం కూడా పన్నినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్యను చంపాలని 1.7 లక్షలు సుపారీ ఇచ్చాడని తేల్చారు. అయితే అజిత్ కుమార్ నుంచి సుపారీ తీసుకున్న వ్యక్తి మరో కేసులో జీవిత ఖైదుగా జైలుకు వెళ్లడంతో ఆ ప్లాన్ కార్యరూపం దాల్చలేదు. దీంతో స్లో పాయిజన్ అయిన ఆర్సెనిక్ ఇచ్చి చంపాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ కేసులో సుపారీ తీసుకుని జైలుకు వెళ్లిన దోషి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలా వద్దా అని పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ మియాపూర్ లోని ఈ దారుణ ఘటన జరిగింది. తన నుంచి విడిపోయిన భార్యపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం లండన్ నుంచి విష ప్రయోగానికి స్కెచ్ వేశాడు. ఇందుకు వాచ్‌మెన్ కుమారుడిని పావుగా వాడుకున్నాడు. కారప్పొడులు, మసాలా పొడుల్లో విషం కలిపి భార్య ఇంటికి డెలివరీ చేయించాడు. ఆ విషయం తెలియని భార్య కుటుంబం వాటిని తినగా ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు అనారోగ్యానికి గురయ్యారు. 


ఎన్ని మందులు వాడినా కోలుకోలేకపోతుండడంతో బాధిత కుటుంబం రక్త పరీక్షలు చేయించగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంచలన కేసు వివరాలను మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ వెల్లడించారు. మియాపూర్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి కుమార్తె శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ అజిత్‌కుమార్‌తో పెళ్లైంది. ఇద్దరు ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో శిరీష లండన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సోదరుడి వివాహానికి శిరీష తన కుమార్తెతో కలిసి లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చింది.


Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?


తనపై లండన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిరీషపై కోపం పెంచుకున్న అజిత్‌కుమార్‌ పగతో రగిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులందరిని హతమార్చాలనుకన్నాడు. ఇందుకోసం లండన్‌లోనే తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌ను ఒప్పించాడు. హైదరాబాద్‌లో ఉండే భవానీశంకర్‌, అశోక్‌, గోపినాథ్‌తోపాటు అజిత్‌ స్నేహితుడు పూర్ణేందర్‌రావులతో కలిసి పథకం రచించాడు. అత్తారింటిపై నిఘా పెట్టమని వారి వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌కు డబ్బు ఇచ్చాడు.


తొలుత శిరీష తల్లిదంద్రులను పాయిజన్ ఇంజెక్షన్లతో పంపాలని పథకం వేశారు. జూన్‌ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా పథకం విఫలమైంది. దీంతో అప్‌సెట్ అయిన అజిత్ పథకాన్ని మార్చాడు. మసాలా పొడులు, పసుపు, కారం వంటి వాటిలో గుర్తుతెలియని విషాన్ని కలిపి శాంపిల్‌ ప్యాకెట్లుగా డెలివరీబాయ్‌ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శిరీష తల్లి ఉమామహేశ్వరి జులై 5న మృతి చెందారు.