Telangana: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్వాగతించారు. కీలక తీర్పు ఇచ్చిన న్యయామూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చాలా సహాయం చేశారని గుర్తు చేశారు. ఈ విజయం కోసమే 30 ఏళ్లుగా పోరాటం చేశాం. ఎందరినో ఉద్యమకారులను కోల్పోయామన్నారు. అయినా పట్టువదలకుండా ఉప వర్గీకరణ సాధించుకున్నామని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 


ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని భావించి ఇన్నేళ్లు పోరాటం చేశామన్నారు మందకృష్ణ. ఈ పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని ఎన్నో కుట్రలు విమర్శలు ఎదుర్కొన్నామని అయినా సహనం కోల్పోకుండా ప్రయత్నించామన్నారు మందకృష్ణ. అయితే ఇది ఒకరి గెలుపో ఇంకొకరి ఓటమినో కాదన్నారు. దళితుల అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.  రానురాను ప్రభుత్వ రంగాల్లో వర్గీకరణ పరిధి తగ్గిపోతుందని అది పెంచేందుకు అందరి నాయకులు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. 


1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు మందకృష్ణ. అప్పటి నుంచి జాతికి జరిగిన అన్యాయాన్ని సరి చేసేందుకు పోరాడామని తెలిపారు. ఈ పోరాటంలో ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచిన వారందరికీ మందకృష్ణ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. తీర్పను అమలు చేయాల్సిన పరిస్థితి అన్ని రాష్ట్రాలపై ఉందని ఎవరూ తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. 


సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వేళ ఇప్పటికే వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు అపాలని మందకృష్ణ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వస్ట్ చేశారు. వీలైనంత త్వరగా రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ అమలుకు జనాభా లెక్కలతో పని లేదని డాటా అంతా ప్రభుత్వాల వద్ద సిద్ధంగా ఉంది తెలిపారు. త్వరలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని తమకు సహకరించిన వారందరికీ ఆ సభలో సన్మానిస్తామని ప్రకటించారు.