కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్. దేశ అభివృద్ధిలో సైనికుల్లా కష్టపడుతున్నారని కితాబు ఇచ్చారు. 


శ్రామిక శక్తిని మంచిన ఆస్తిలేదన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి. శ్రామికులు భాగస్వామ్యం లేని అభివృద్ధి ఊహించుకోలేమన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనాలు చేశారు. కార్మికులందరికీ శుభాకాంక్షలు చెప్పారు ఏపీ సీఎం జగన్. 






మే డే స్ఫూర్తితో ప్రభుత్వం పని చేస్తుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తుందని వివరించారు. తాము రూపొందించిన పారిశ్రామిక విధానం అందరి ప్రశంసలు అందుకుంటుందని చెప్పారు. 
కార్మికుల శక్తి తెలిసిన ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టిందని అధికారికంగా మేడే వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరోగమన విధానాలు వదిలేసి సరికొత్త విధానాలతో శ్రామిక లోకానికి మంచి చేసే కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఒకప్పుడు పెట్టుబడులు, పారిశ్రామిక రంగం కళకళలాడేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయని విమర్సించారు. కార్మిక లోకం తల్లడిల్లిపోతుందన్నారు. 






కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశమైనా ఏ జాతి అయినా అభివృద్ధి పధాన పయనించలేదన్నారు పవన్ కల్యాణ్. ఎక్కడ శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తుందో ఎక్కడ కార్మికులు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తారో అక్కడ సమాజం సిరిసంపదలతో అలరారుతుందన్నారు. దేశ సౌభాగ్య కోసం ఎండనకా, వాననకా, కాలలకు అతీతంగా నిద్రహాలు మాని దేశం కోసం అహరాహం కష్టించి, శ్రమించే కార్మికులందరికీ శుభాకాంక్షలు చెప్పారు పవన్ కల్యాణ్. 






శ్రీశ్రీ కవితను పోస్టు చేసి కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.