Telangana Crime News: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ మాదకద్రవ్యాలు సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. సరఫరా చేస్తున్న వారితోపాటు వినియోగిస్తున్న వారిని కూడా పట్టుకుంటున్నారు. అదై టైంలో బార్‌లు, హుక్కాసెంటర్‌లు, పబ్‌లపై నిఘా పెట్టి తేడా వస్తే తాటతీస్తున్నారు. 


డ్రగ్స్‌ను కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడి చేసారు. మాదాపూర్ పోలీసుల బృందం  గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌లో సోదాలు చేశారు. అక్కడ అంతా రూల్స్‌కు వ్యతిరేకంగా ఉందని యజమాని అబ్దుల్ ఫరీద్‌తో పాటు మరో ఆరుగురిపై కేస్ నమోదు చేశారు. ప్రస్తుతం యజమాని అబ్దుల్ ఫరీద్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. 


మరోవైపు డ్రగ్స్‌ వాడటమే కాకుండా సరఫరా చేస్తున్న ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను పోలీసులు పట్టుకున్నారు.SOT బాలానగర్ బృందం మాదాపూర్ PS పరిధిలోని ఖాన్‌మెట్‌ హాస్టల్‌లో ఉంటున్న ఫణికిరణ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ హాస్పిటల్‌లో నెట్వర్క్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతని వద్ద నుంచి 1.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


ఫణికుమార్‌ను పోలీసులు విచారించగా అతను ఏపీలోని రావుపాలెం వాసిగా గుర్తించారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చి మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలోని ఖానామెట్‌లోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. గతంలో కూడా ఇతనిపై కేసులు ఉన్నట్టు తేలింది. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదై అరెస్టు కూడా అయ్యాడు. 


అరెస్టు జైలుకు వెళ్లి వచ్చినా ఫణి తన బుద్ది మార్చుకోలేదు. ఈసారి మరింత పక్కాగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. వైజాగ్‌ నుంచి గంజాయి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు. తీసుకొచ్చిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి అవసరమైన వ్యక్తులకు అమ్మడం మొదలు పెట్టాడు. 


అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు మాదక ద్రవ్యాల సరఫరానువ్యాపారంగా మార్చుకుంటున్నారని పోలీసులు చెప్పారు. శుక్రవారం జీడిమెట్లలో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. అక్రమ సంపాదనకు అలవాటు అల్ఫజోలంను తయారు చేసి అమ్ముతూ కిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని ఆస్తులను ఇప్పుడు జప్తు చేశారు.  2021 నుంచి ఈ దందా సాగిస్తున్నాడు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో కెమికల్ కంపెనీ పేరిట నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్నాడు. 2023 డిసెంబర్ 27న పోలీసులకు చిక్కాడు. 


కేసును పూర్తిగా దర్యాప్తు చేసిన అధికారులు అతనిపై, అతని భార్య పేరు మీద ఉన్న 68లక్షల 50వేల విలువ గల ఆస్తులు జప్తు చేశారు. వారికి సంబందించిన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా సంపాదించి ఆస్తులుగానీ, వేరే ఏదైనా ప్రాపర్టీ కోసం వెచ్చించినా చట్ట ప్రకారం ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేస్తామని తెలిపారు పోలీసులు.


చిత్తూరు జిల్లా పలమనేరులో కూడా భారీగా గంజాయి చిక్కింది. బైరెడ్డిపల్లి మండలం కైగల్ గ్రామ వద్ద ఆటోలో తరలిస్తున్న 10 కేజీల గంజాయి పోలీసులు సీజ్ చేశారు. ఆటోతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసి నాలుగు బైకులు స్వాధీనం  చేసుకున్నారు. పలమనేరు నుంచి అక్రమ రవాణా చేస్తూ బైరెడ్డిపల్లి వీకోట గ్రామాలలో ఈ ముఠా అమ్ముతోంది. తుని నుంచి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ చిక్కిందీ ముఠా.