ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ - Indian School of Business స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా జరుగుతున్న స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా HCU కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 2 కిలో మీటర్లు ప్రయాణించి ISBకి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ఉన్నత అధికారులు, బీజేపీ లీడర్లు ప్రధానికి స్వాగతం పలుకుతారు.


మధ్యాహ్నం 2 గంటలకు మోదీ ISB కి చేరుకుంటారు. ఈ స్నాతకోత్సవంలో 2022 సంవత్సరానికి పీజీ పూర్తి చేసుకున్న 930 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణి చేయనున్నారు. తొలిసారిగా ఐఎస్‌బీ హైదరాబాద్‌, పంజాబ్ లోని మొహాలీ క్యాంపస్‌లతో కలిపి ఉమ్మడి స్నాతకోత్సవం ISB నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2.35 గంటల నుంచి 3.10 గంటల వరకు విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. గంటపాటు ISBలో గడపనున్న ప్రధాని 3.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి.. తిరిగి 3.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరి వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు.


హైదరాబాద్‌లో  ప్రధాని మోదీ పర్యటన అధికారిక షెడ్యూల్:
* మే 26న మధ్యాహ్నం 1 .30 గంటల కి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ 
* 1.45  వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్  పార్కింగ్ లో బీజేపీ నేతలతో మీటింగ్ 
* 1.50 కి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు మోదీ. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ప్రయాణించి ఐఎస్‌బీకి
* మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 
* తిరిగి సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ 
* 4 .15 గంటలకు  బేగంపేట్ నుంచి చెన్నై కి బయలుదేరనున్న ప్రధాని 


మోదీ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో 2000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్నాతకోత్సవం కు వచ్చే విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈఎస్బి, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. డ్రోన్ కెమెరాలకు అనుమతి నిరాకరించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సెలవులో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.