గతేడాది కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ, తడిసిన ధాన్యం సైతం: మంత్రి గంగుల
- తడిసిన ధాన్యం సేకరణకు వీలుగా 1.28 LMT’s బాయిల్డ్ ఉత్తర్వులు
- ప్రతికూల పరిస్థితుల్లోనూ చురుగ్గా కొనసాగుతున్న కొనుగోళ్లు
- రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
- గత సంవత్సరం కన్నా రెండున్నర రెట్లు అధికంగా సేకరణ
- 40వేల రైతులు, 95వేల లావాదేవీలు, 7.51 LMT’s ‘ కొనుగోలు
- నిధుల కొరత లేదు, వేగంగా చెల్లింపులు 
- అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణపై మంత్రి గంగుల సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసామన్నారు. మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి అత్యవసర బాయిల్డ్ ఉత్తర్వులు ఇచ్చామని, సేకరణ జరుగుతున్న రీతిలో పెంచుతామన్నారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన  జిల్లాలైన నల్గొండలో 22వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూర్యాపేట కొత్తగూడెంలకు జిల్లాకు 14,706 మెట్రిక్ టన్నులు, నిజమాబాద్ లో 14,700, కరీంనగర్లో 7350, యాదాద్రి, జగిత్యాలల్లో 5000వేల మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ ఆర్డర్ని ఇచ్చామన్నారు మంత్రి గంగుల కమలాకర్.


ఇప్పటివరకూ గత సంవత్సరం యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేసామని, గతేడాది ఇదే రోజున 3.23 LMT's మాత్రమే కాగా ఈరోజు వరకే 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి  రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుండి 95 వేల లావాదేవీల ద్వారా 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, వీటి విలువ 1543 కోట్లని, నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వేగవంతం
- బీసీ, ఎంబీసీ ఆక్షన్ ప్లాన్ అమలుకు చర్యలు
- ఎంజేపీ గురుకులాల విధ్యార్థుల మెరుగైన ఫలితాలు
- బీసీ సంక్షేమ శాఖపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు వేల కోట్ల విలువైన స్థలాల్లో నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య బట్టు పాల్గొన్న ఈ సమావేశంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు సకల హంగులతో ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మించాలన్నారు. మౌళిక వసతుల కోసం ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వేగంగా పనులు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. 


బీసీ, ఎంబీసీ కార్పోరేషన్ల ద్వారా అందించే 603 కోట్లకు సంబందించిన ఆక్షన్ ప్లాన్ విధివిదానాలపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎంజేపీ విధ్యార్థులు అత్తున్నత ప్రతిభ కనబరుస్తున్నారని, జేయీయీ మెయిన్స్ క్వాలిఫై అయిన విధ్యార్థులకు తదుపరి అడ్వాన్స్ శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, మహాత్మాజ్యోతిభాపూలే వెనుకబడిన వర్గాల గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.