కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు ఫిబ్రవరి 17 వ తేదీ శుక్రవారం  ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. 


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.