Hyderabad Crime News: చాలా మందికి సినిమాల్లో నటించాలని.. ఆ ఫీల్డ్‌లోకి వెళ్లాలననే కోరిక ఉంటుంది. దీన్నే కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. స్టార్ నటులు, క్రికెటర్లతో యాడ్స్ లో కలిసి నటించే అవకాశం కల్పిస్తామని మాయ మాటలు చెప్తారు. నమ్మిన వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఆపై మొహం చాటేస్తారు. ఇలా మోసాలకు పాల్పడి లక్షలు దోచేసిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 లక్షల 60 వేల రూపాయలతో పాటు నాలుగు స్మార్ట్ ఫోన్లలో స్వాధీనం చేసుకున్నారు. 


అసలేం జరిగిందంటే..?


మహారాష్ట్రలోని పుణెకు చెందిన అపూర్వ అశ్విన్ దావా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మాస్టర్స్ పూర్తి చేశాడు. దర్శకత్వం, నటనపై ఇష్టంతో 20 ఏళ్ల పాటు మోడలింగ్ లో కొనసాగాడు. ఆ తర్వాత రెండు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ అపూర్వ అశ్విన్.. పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. చాలా సినిమాల్లో నటించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవకాశం రాకపోవడంతో.. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు. చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు పేరుతో మోసాలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తనతోపాటు మోడలింగ్ రంగంలో ఉన్న నటాషా కపూర్ ను వివాహం చేసుకున్నాడు. 


ఈమె కూడా అశ్విన్ నేరాలు చేయడాన్ని ప్రోత్సహించింది. సాయం కూడా చేసింది. ఇలా వీరిద్దరూ కలిసి కాస్మోపాలిటన్‌ మోడల్ పేరుతో వెబ్ సైట్ ను కూడా రూపొందించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎక్కువ రద్దీగా ఉండే మాల్స్ మేనేజర్లతో మాట్లాడి చిన్నారులకు ర్యాంప్ వాక్ నిర్వహించేవాడు. ఇలా చిన్నారులతో సహా షాపింగ్ మాల్ కు వచ్చే తల్లిదండ్రులకు వల వేసి.. ప్రముఖ నటీనటులు, క్రికెటర్ల ప్రకటనల్లో నటింటే అవకాశం కల్పిస్తానని అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారు.


వారం రోజులు కాగానే వారికి ఫోన్ లు చేసి చిన్నారులు యాడ్ ఫిల్మ్ కు ఎంపికైందని.. సినీ నటులు, క్రికెటర్లతో నటించే అవకాశం వచ్చిందని నాటాషా నమ్మించేది ఆపై ప్యాకేజీ ఛార్జీలు, దుస్తులు, మేకప్ సహా అనేక పేర్లతో డబ్బులు వసూలు చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు. ఇలా నగరంలోని మదీనాగూడకు చెందిన గోపాల కృష్ణన్ తన కూతురు జన్మదినం సందర్భంగా కొండాపూర్ లోని ఓ షాపింగ్ మాల్ కు కుటుంబంతో సహా కలిసి వెళ్లారు. హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి ఓ యాడ్ లో నటింటే అవకాశం కల్పిస్తానని చెప్పి.. అతడి నుంచి 3 లక్షల 25 వేల రూపాయలు తీసుకున్నారు. ఫొటో షూట్ కోసం 15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 


కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోసాలకు పాల్పడిన అపూర్వ అశ్విని, నటాషా దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే నిందితుల నుంచి రూ.15.60 లక్షలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.