కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. దేశంలో పట్టణ ప్రాంతంలో నివసించే పేద ప్రజల కోసం కూడా ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కోరారు. ఇప్పటికే ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా దాన్ని రూపొందించాలని సూచించారు. ఈ అంశాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పరిశీలించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన సవివరమైన సూచనలను మంత్రి లేఖలో ప్రస్తావించారు. పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అని, ఇందుకు భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందని, 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణాలకు చేరుతుందని అన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని కేటీఆర్ అంచనా వేశారు.


మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలవైపు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన కూడా తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని అన్నారు. పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికంపైన దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలని అన్నారు. పట్టణ పేదలకు అవసరమైన హౌసింగ్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాధి వంటి అంశాలపైన ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 


పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలంటే వారి ఆదాయం పెరగాలని.. కానీ, వీరంతా అధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. ఒక్కరోజు ఉపాధి దొరకక ఉంటే వారి జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్న వేళ వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసాను ఇవ్వాలని అన్నారు. కరోనా సంక్షోభం వలన పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చ్ మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరం అన్నారు.


బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి: ఆర్‌.కృష్ణయ్య
కేంద్ర బడ్జెట్‌‌ల్లో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీసం 5 శాతం బడ్జెట్‌ కేటాయించరా? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం బీసీలకు రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇది దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. బడ్జెట్‌లో బీసీలకు లక్షకోట్లు కేటాయించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.