రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ అవసరం అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగేటట్టు లేదు. ఈ ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన కామెంట్స్‌ రైతులకు ఇది కాంగ్రెస్‌ నుంచి వచ్చిన రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతుల జాగ్రత్త పడాలని సూచించారు. 


ఆయన ఇంకా ఏమన్నారంటే... కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నారని... ఇప్పుడు అదే రాబందు నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారని ఫైర్ అయ్యారు. నాడు వ్యవసాయం దండగ అన్నారు చంద్రబాబు... నేడు మూడుపూటలు దండగ అంటున్నారు చోటా చంద్రబాబు అంటూ రేవంత్‌పై విమర్శలు చేశారు. 






మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం అంటే ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపని కామెంట్ చేశారు. సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అన్నారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమన్నారు. అన్నదాత నిండా మునుగుడు పక్కా అని స్టేట్‌మెంట్ పాస్ చేశారు. 


నాడు ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్... నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందన్నారు కేటీఆర్. మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం అవుతాయన్నారు. 






మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని అభిప్రాయపడ్డారు కేటీఆర్. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని తెలిపారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ?? తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. 


కాసేపటికే మరో ట్వీట్ చేసిన కేటీఆర్‌... కేసీఅర్ నినాదం మూడు పంటలు అయితే.. కాంగ్రెస్ విధానం మూడు గంటలని... బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా మూడు గంటలు కావాలా... మతం పేరిట మంటలు కావాలా తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అన్నారు. 


Also Read: తెలంగాణ కాంగ్రెస్ ఐక్యత డొల్లే - రేవంత్‌ను ఇబ్బంది పెట్టడానికి సీనియర్లు బీఆర్ఎస్‌కు బలం చేకూర్చారా ?