మందికి పుట్టిన బిడ్డను తమదే అంటూ బీజేపీ లీడర్లు తిరుగుతున్నారని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బౌర్డు కాలనీలో వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపనలో మాట్లాడిన హరీష్‌. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించారు. ఒకప్పుడు నీటి కోసం హైదరాబాద్‌లో ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవని ఇప్పుడు అలాంటి సమస్యే లేదన్నారు. మహారాష్ట్రలో నేటికీ వారం పదిరోజులకోసారి నీళ్లు వచ్చే ప్రాంతాలు ఉన్నాయన్నారు. 


హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటును ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు హరీష్‌. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు సప్లై చేసే వారి బిజినెస్‌ లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 ఏళ్లలో ఒకే ఒక మెడికల్ కాలేజీ పెట్టారని స్వరాష్ట్రపాలనలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకన్నామన్నారు. ఇకపై ఇక్కడ విద్యార్థులు ఎక్కడో విదేశాలకు వెళ్లి డాక్టర్‌ విద్యను చదువుకోవాల్సిన పని లేదని ఇక్కడే వైద్యులుకావచ్చని అన్నారు. అలాంటి మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్టు బీజేపీ ప్రచారం చేసుకుంటుందన్నారు.    ఆ పార్టీది జూటా ప్రచారమని మందికి పుట్టిన బిడ్డను తమదే అన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ అమలు అవుతున్నాయన్నారు హరీష్. పుట్టక నుంచి చావు వరకు మనిషికి ఏం కావాలో తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బీజేపీ లీడర్లు, మంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇస్తారని... గల్లీ కొచ్చి తిడతారని విమర్శించారు. ప్రజలు వీటన్నింటినీ గుర్తు పెట్టుకొని ఆలోచించాలన్నారు. పని చేసేవారిని ఆశీర్వదించాలని కోరారు. 
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపి.హెచ్.బి డివిజన్ 5వ ఫేజ్‌లో సుమారు 60 లక్షలతో  నిర్మించే ఆసుపత్రికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావ్, శంబిపూర్ రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు హరీష్‌. నియోజకవర్గంలో ఉన్న చెరువులతో పాటు స్థానికంగా ఉన్న రైతుబజార్‌ను ఎంతో అభివృద్ధి చేశామని, ప్రస్తుతం నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా పరిష్కరించామన్నారు. 9 నెలలలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి 35 మంది డాక్టర్లతో పాటు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. 


ఈనెల 14వ తేదీ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రారంభిస్తున్నామని, తెలంగాణ ఆరు లక్షల మందికి పైగా ఉన్న గర్భవతులకు నాలుగో నెలతో పాటు ఏడో నెలలో ఈ కిట్లను అందిస్తామన్నారు హరీష్‌. 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలలో ఏర్పాటు చేశామని గతంలో 2,950 సీట్లు ఉంటే నేడు 8,340 ఉండేలా కృషి చేసామన్నారు.