Damodar Raja Narasimha:  వైద్యో నారాయణ హరి.. అంటూ వైద్యులను పూర్వకాలం నుంచి దైవంగా భావిస్తారు. ఇలాంటి డాక్టర్లు తమ వృత్తి ధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు కూడా ఇలాగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు 12గంటలకే విధులకు డుమ్మా కొడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే ఫోన్ చేయాలని పీజీ వైద్యులకు చెబుతూ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతున్నారు. ఎవరైనా అధికారులు వస్తున్నట్లు తెలిస్తే వెంటనే వచ్చి విధుల్లో ఉన్నట్లు నటిస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగులతో మెరుగైన వైద్యం కావాలంటే ప్రైవేటుకు వెళ్లాలంటూ సొంత ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు.  డాక్టర్లు బయట ఆస్పత్రుల్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పనిచేస్తున్నా.. అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీలను నియమించింది. ఆ కమిటీల విధుల గురించి మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.


నిత్యం తనిఖీలు చేయాల్సిందే
ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల వివరాలను ప్రతి నెలా తనకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు.  ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.  ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు నెలకు కనీసం రెండుసార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు.  హాస్పిటల్ హెచ్‌ఆర్, అటెండెన్స్‌, ఎక్విప్‌మెంట్, మెడిసిన్, సానిటేషన్, డైట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.  ఈ మేరకు మంత్రి శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మెడిసిన్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.






వారి ఆరోగ్యంపై ఫోకస్ చేయాలి
ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణుల ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈడీడీ (ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌) వివరాలతో ఓ క్యాలెండర్ మెయింటేయిన్ చేయాలని, ట్రైబల్ ఏరియాల్లో ఉన్న గర్భిణులను ఈడీడీ కంటే వారం రోజుల ముందే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి, వారికి బర్త్ వెయిటింగ్‌ రూమ్స్‌ను అలాట్ చేయాలని సూచించారు. ఐటీడీఏల పరిధిలో ఉన్న హాస్పిటళ్ల అభివృద్ధిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయా హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి తనకు ఇవ్వాలని అధికారులకు సూచించారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, టాస్క్‌ఫోర్స్ కమిటీలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానని, అన్ని వివరాలతో రివ్యూకు అటెండ్ కావాలని అధికారులకు మంత్రి సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.