Megha Engineering Infrastructures Ltd MEIL to built building for Young India Skills University | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఛేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకు వచ్చింది. మొత్తం స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వీటితో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన  భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను మేఘా సంస్థ స్వీకరించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా యూనివర్సిటీని నిర్మించేందుకు మేఘా కంపెనీ ముందుకు రావడం శుభపరిణామం.


సీఎం రేవంత్ తో మేఘా ప్రతినిధులు భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధుల బృందం శనివారం సచివాలయంలో సంప్రదింపులు జరిపింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మెఘా కంపెనీ చర్చలు జరిపింది. ఈ క్రమంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని మేఘా ఎండీ ప్రకటించారు. స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో మేఘా సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.


తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, Skills యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సచివాలయంలో నేడు సంతకాలు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 


కందుకూరులో స్కిల్స్ యూనివర్సిటీ
హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట వద్ద 57 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ నెలలోనే స్కిల్స్ వర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ లో అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా స్కిల్స్ క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ఆర్ నిధులతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేఘా ఎండీకి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు స్కిల్స్ యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మెఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. 


Also Read: Indiramma Houses APP: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి


ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో రూపొందించిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను మేఘా కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన తాజా సమావేశంలో ప్రదర్శించారు. భవన డిజైన్లకు వారం రోజుల్లోగా తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిపుణులకు సూచించారు. నవంబర్ 8 నుంచి స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని మేఘా కంపెనీకి భరోసా ఇచ్చారు.



Also Read: ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?