Marri Sasidhar Reddy likely Join BJP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం నాడు కలిశారు. అమిత్ షాతో శశిధర్ రెడ్డి భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరికపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాతో కాసేపు చర్చించారు. పార్టీలో చేరికను బీజేపీ పెద్దలు స్వాగతించినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి మంచిరోజున పార్టీలో చేరుతానని శశిధర్ రెడ్డి అన్నట్లు సమాచారం.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు మూడు రోజుల్లోనే జేపీ నడ్డా సమక్షంలో శశిధర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకే లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిపై బీజేపీ పెద్దలు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ సందర్భంగా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ ప్రస్తావించారు. వెంటనే అమిత్ షా ఫోన్ చేసి అరవింద్‌తో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఏ ఆందోళన చెందవద్దని, మన పోరాటం కొనసాగాలని సూచించారు. 


ఇటీవల రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..
మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం రెండు రోజుల కిందట ఒక్క సారిగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. డీకే అరుణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిసి ఆ పార్టీలో చేరుతారని ఒక్క సారిగా గుప్పుమంది. అయితే ఈ ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు..  వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చినట్లు చెప్పారు. తానింకా రాజకీయాల్లో ఉన్నానని, రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. 


ఒకే విమానంలో ప్రయాణించడంతో  పార్టీ మార్పు ప్రచారం
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు.  ఆయన.. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానంటూ పుకార్లు పుట్టించడం సరికాదన్నారు.  మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదురల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఆయన తప్పుబడ్డారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. కానీ అంతలోనే మర్రి శశిధర్ రెడ్డి ప్లేట్ మార్చేశారు. రెండు రోజుల వ్యవధిలో బండి సంజయ్, డీకే అరుణతో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. 


ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు అయిన మర్రి శశిధర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉన్న నేతగా యూపీఏ హయాంలో కేంద్ర విపత్తుల నిర్వహణా సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత ఆయనకు పెద్దగా పని ఉండటం లేదు. పార్టీ పరమైన పదవులు కూడా పెద్దగా లభించలేదు.