బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో హైదరాబాద్ పేరు భాగ్యనగర్ అని ఒక పోస్ట్ చేయడాన్ని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఒక పోస్టు చేసింది. ఆ పోస్టులో "భాగ్యనగర కీర్తి కిరీటంలో కొత్తగా చేరిన మూడు రత్నాలు" అని క్యాప్షన్ రాసి ఉంది. ఆ మూడు రత్నాలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.


అయితే, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా వర్ణించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వారు సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటారు. హైదరాబాద్ ను భాగ్యనగర్ గా మారుస్తామని తరచూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తుండే సంగతి తెలిసిందే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ అగ్ర నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ను భాగ్య నగర్ అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఈ అంశంపై మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ స్పందిస్తూ.. MBT పార్టీ అధికార భారత రాష్ట్ర సమితి (BRS), దాని ప్రతిపక్షమైన బీజేపీని తీవ్రంగా విమర్శించింది. హిందూత్వ శక్తులను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందా? అని ప్రశ్నించారు. 


ఇప్పుడు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) భాగ్యనగర్ పేరును పెట్టి హిందుత్వ శక్తులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అని అమ్జెద్ ఉల్లా ఖాన్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చర్యను ఆయన ఖండించారు. హైదరాబాద్‌కు భాగ్యనగర్ అని పేరు పెట్టలేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ పేరు గురించి ఆర్టీఐ ద్వారా గతంలో అడిగిన ప్రశ్నకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమాధానం ఇస్తూ.. హైదరాబాద్ పేరును మార్చబోవడం లేదని స్పష్టం చేశారు.


తెలంగాణలో హైదరాబాద్ పేరు మార్పు వివాదం చాలా కాలంగా నలుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలు ఈ అంశాన్ని పలు సందర్భాల్లో లేవనెత్తారు. చారిత్రక, సాంస్కృతిక కారణాలను చూపుతూ పేరు మార్పు కోసం బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక నిర్దిష్ట వర్గం మెప్పు పొందేందుకే బీజేపీ హైదరాబాద్ పేరు మార్పు అంశం తెరపైకి తెస్తోందని, ఇది రాజకీయ జిమ్మిక్కు అని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు తరచూ కౌంటర్ ఇస్తుంటాయి.






స్పష్టత ఇచ్చిన పురావస్తుశాఖ


గత ఏడాది ఆగస్టులో రాబిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా పురావస్తు శాఖ (ఏఎస్ఐ) కీలక విషయాలు వెల్లడించింది. హైదరాబాద్‌ను భాగ్య నగర్ అనేందుకు తగిన చారిత్రక ఆధారాలు, నేపథ్యం ఏమీ లేదని స్పష్టం చేసింది. అలాగే చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా లేవని ఏఎస్ఐ చెప్పింది. ‘‘హైదరాబాద్ నగరానికి ఆ పేరు తప్ప భాగ్య నగర్ లేదా మరో పేరేదీ గతంలో లేదు. భాగమతి లేదా భాగ్యనగర్‌కు సంబంధించి కూడా ఎలాంటి మినీయేచర్ లేదు. అలాగే ఈ పేర్లతో ఎలాంటి కాయిన్ కూడా విడుదల కాలేదు.’’ అని స్పష్టం చేసింది. గతంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.. హైదరాబాద్ పేరు మార్చేందుకు ప్రయత్నించినట్లు ఎలాంటి ఆధారం లేదని స్పష్టత ఇచ్చింది.