Kottagudem Chair Person : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ ఉన్న బైక్ ను సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు బైక్ తో ఢీకొట్టారు. దీంతో ఛైర్ పర్సన్ రోడ్డు పైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగూడెంలో చర్చనీయాంశంగా మారింది. నేతల ఆధిపత్య పోరుకు టీఆర్ఎస్ రైతు దీక్షలు వేదికవుతున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌ పర్సన్ సీతాలక్ష్మీని కౌన్సిలర్ భర్త బైక్‌తో ఢీకొట్టి కిందపడేశాడు. ఆమె కింద పడిపోయిన తర్వాత హేళన చేయడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.



ఛైర్ పర్సన్ ను బైక్ తో ఢీకొట్టిన కౌన్సిలర్ భర్త  


కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లజెండాల టీఆర్ఎస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మీ పాల్గొన్నారు. ఆమె పట్ల కౌన్సిలర్ భర్త అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె బైక్‌ని కౌన్సిలర్ భర్త మరో బైక్ తో ఢీకొట్టాడు. దీంతో అదుపుతప్పి ఛైర్‌పర్సన్‌ కిందపడిపోయారు. దుస్తులు జారీపోతున్నాయని వేడుకున్న సదరు నేతలు హేళన చేశారు. ఈ అవమానంతో ఆమె కంటతడి పెట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకి ఆమె జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. 


పరామర్శించిన ఎమ్మెల్యే వనమా 


ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఛైర్ పర్సన్ ఇంటికెళ్లి ఆమెను పరామర్శించారు. మహిళా నేతను కిందపడేయడమే కాకుండా బట్టలు జారిపోతే హేళన చేయడం అత్యంత హేయంగా ప్రవర్తించారని ఆమె వాపోయారు. బైక్ ర్యాలీలో జరిగిన అవమానానికి మున్సిపల్ ఛైర్‌ పర్సన్ సీతాలక్ష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు. బైకులో చీర చిక్కుకుందని వేడుకున్నా, చీర జారిపోతుందని దండ పెట్టినా బైక్ రైజ్ చేసుకుంటూ వెళ్లారని వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఛైర్ పర్సన్ కే ఇలాంటి అవమానం జరిగితే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కొత్తగూడెం జిల్లా ఈ వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. టీఆర్ఎస్ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? లేక సర్ధిచెబుతారా? వేచిచూడాల్సి ఉంది.