తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, బంధువుల ఇళ్లల్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన తనిఖీలు 24 గంటల పాటు సాగుతున్నాయి. అయితే ఈ ఉదయం నుంచి ఈ తనిఖీల్లో హైడ్రామా నెలకొంది. 


చాతీ నొప్పి ఉందని మల్లారెడ్డి కుమారుడు ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన మల్లారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు. ఆయన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదం చేస్తూనే ఆసుపత్రికి బయల్దేరారు. 


దీంతో సీన్‌ నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరింది. ఐటీ అధికారులు ఆసుపత్రికి చేరుకొని మల్లారెడ్డి కుమారుడు
 మహేందర్‌ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వైద్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. 


నిన్న ఉదయం ఐదు గంటల నుంచి మల్లారెడ్డి చెందిన ప్రాపర్టీస్‌పై నాన్‌స్టాప్‌గా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒకేసారి వందల మంది ఐటీ అధికారులు ఆయనతోపాటు ఆయన సంబంధీకుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.


రెండు రోజులు ముందుగానే మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ అధికారులు ప్లాన్లు వేశారని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ఆయన వద్దకే వెళ్లి వివరాలు ఆరా తీసినట్టు సమాచారం. మల్లారెడ్డికి బాగా తెలిసిన వ్యక్తి ద్వారానే మొత్తం కథను నడిపించారని ఐటీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం.


రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల్లా ఐటీ అధికారులు... మల్లారెడ్డి ఇంటికి వెళ్లి ప్రాథమిక అంశాలపై ఆరా తీశారు. ఓ డీల్‌ విషయం మాట్లాడినట్టు తెలుస్తోంది. అన్నింటినీ సరి చూసుకున్న తర్వాత రెండు రోజుల్లోనే దాడులు నిర్వహించారు. నిన్న ఉదయం ఒక్కసారి వందల మంది అధికారులు ఆయా నివాసాలు, ఆఫీసులపై మూకుమ్మడి దాడులు చేశారు. వందల బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నారు.


తెల్లవారుతుండగానే మొదలైన సోదాలు


మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి.


మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి.


కొత్త విషయాలు


మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్‌ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జైకిషన్‌, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్‌ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు అని గుర్తించారు. సీఎంఆర్‌ స్కూల్స్‌లో నరసింహ యాదవ్‌, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహ యాదవ్‌, జైకిషన్‌ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు.