హైదరాబాద్‌లో నడిబొడ్డున వచ్చే పది రోజులు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. ఎందుకంటే సమీప ప్రాంతాల్లో జరుగుతున్న ముఖ్యమైన ఈవెంట్ల ఫలితంగా ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలువరిస్తున్నారు. వాహనాలను మళ్లించడం వల్ల ఇరుకు రోడ్లలో చిక్కుకుపోయి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే గత మూడు రోజులుగా నగర ప్రజలను ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నాయి. మంగళ, బుధవారాలు ట్రాఫిక్‌ సమస్య మరింత ఎక్కువ అయింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు మెయిన్ రోడ్లు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. 


కారణం ఏంటంటే..
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి, అసెంబ్లీ మార్గంలో ఆంక్షలు ఉన్నాయి. ఈ నెల 11న ఫార్ములా - ఈ రేసింగ్‌, 15 వరకు నాంపల్లిలో నుమాయిష్‌ ఎగ్జిబిషన్, 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. 18న శివరాత్రి వేడుకలు ఉంటాయి. ఈ కారణాల రీత్యా మరో 10 రోజులపాటు ఏదో ఒక కారణంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురుకానున్నాయి. దీనివల్ల వాహనదారులు నరకం చూడక తప్పని పరిస్థితి నెలకొంది. షిఫ్టుల వారీగా ట్రాఫిక్‌ పోలీసులు 24 గంటలు విధుల్లో ఉన్నప్పటికీ ఫలితం ఉండడం లేదు.


కిలో మీటరుకే 45 నిమిషాలు


గ్రేటర్‌ హైదరాబాద్ లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 30-40 లక్షల దాకా రోజూ రోడ్డుపైకి వస్తుంటాయి. ఉదయం, సాయంత్రం రద్దీ కారణంగా 10-12 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 30-40 నిమిషాలు పడుతోంది. కొద్దిరోజులుగా కిలోమీటరు దూరానికే 40 నిమిషాలు పడుతూ ఉంటుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాసబ్‌ట్యాంక్‌ - ఖైరతాబాద్‌కు 45 నిమిషాలు సమయం పట్టిందన్న వాహనదారులు కూడా ఉన్నారు. ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగేందుకు నిబంధనల ఉల్లంఘనులే ప్రధాన కారణమని పోలీసులు అంటున్నారు. 


హైదరాబాద్ లో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై ప్రతిరోజూ సుమారు 17 వేల చలానాలు నమోదవుతుంటాయి. వీరిలో అధిక శాతం నోపార్కింగ్‌, రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌రైడింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవటం, అధిక వేగం, మైనర్ల డ్రైవింగ్‌, డ్రంకన్‌ డ్రైవింగ్‌, నంబరు ప్లేటు, లైసెన్స్‌ లేనివారే ఉంటున్నారు. ప్రధాన మార్గాల్లో ఇష్టానుసారం చేరుతున్న తోపుడుబండ్లు, దుకాణాల వద్ద వాహనాలు నిలపటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమయ్యారు.