Minister Komati Reddy Venkat Reddy Comments: నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.700 కోట్ల రూపాయలు మంజూరీ చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్జతలు తెలియజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బైపాస్ నిర్మాణం వల్ల నల్గొండ పట్టణం అద్భుతంగా అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు ప్రమాదాలు, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తొలిగిపోతాయని మంత్రి తెలియజేశారు. ఇవాళ (ఫిబ్రవరి 21) బంజరాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. నిన్నటి ఢిల్లీ పర్యటన వివరాలను తెలియజేశారు. ఆనాడు డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కు గేమ్ ఛేంజర్ గా ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువచ్చారని.. దాంతో హైదారాబాద్ లో ఎయిర్ పోర్ట్, సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలు అభివృద్ధి చెందాయని.. తాము రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించి హైదరాబాద్ కు సూపర్ గేమ్ ఛేంజర్ గా మారుస్తున్నామని వివరించారు.


నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జాతీయ రహదారుల  గురించి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విన్నవించడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు. అడిగిన 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలనే వినతిపై నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రగతిని మార్చే ఈ 16 జాతీయ రహదారుల గురించి దాదాపు గంటన్నరపాటు చర్చించి రాష్ట్ర అవసరాలను వివరించామని తెలిపారు. అందుకు వారు స్పందించి తక్షణం అనుమతులు మంజూరీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇవే కాకుండా సిఆర్ఐఎఫ్ కింద మరో రూ.855 కోట్ల రూపాయలను మంజూరీ అయ్యేలా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.


దేశంలో లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికి కేసిఆర్ ప్రభుత్వం కేంద్రంతో పేచీలు పెట్టుకొని జాతీయ రహదారులు రాకుండా చేసిందని.. కానీ నిన్న నితిన్ గడ్కరీతో మాట్లాడినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. తాను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పటికి ఆనాడు గడ్కరీ ఎల్బీనగర్-మల్కాపూర్ కు రహదారికి ఆరు వందల కోట్లు, గౌరెల్లి భద్రచాలానికి మూడు వందల కోట్లు మంజూరీ చేశారని. ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతిపక్షం, అధికారపక్షం అనేతేడా లేకుండా ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ పనులు నడుస్తున్నయని వివరించారు. ఈ 16 రహదారులను వెంటనే మంజూరీ చేస్తామని తెలిపినట్లు మంత్రి వివరించారు.


ఇక దశాబ్ధాలు గడిచినప్పటికి ఏ ముఖ్యమంత్రి మూసీ నది కాలుష్యాన్ని పట్టించుకోలేదని.. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ గతిని మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ లోని సబర్మాతీ నదిని 40 వేల కోట్లతో కాలుష్యాన్ని తొలగించి, సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతం చేస్తే.. మన గత ముఖ్యమంత్రి కాళేశ్వరం వంటి ప్రాజెక్టును కట్టి ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ కృషితో మూసీ కాలుష్యాన్ని తొలగించి టూరిస్టు స్పాట్ గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఖచ్చితంగా మూసీ కాలుష్యాన్ని తొలగించి పర్యాటక ప్రాంతంగా చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్డు పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తేల్చిచెప్పారు.


గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఎప్పుడో పనులు జరగాల్సిన రీజినల్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయాయని ఆయన ఆరోపించారు. లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టులన్న గత ప్రభుత్వం రూ. 363.43 కోట్ల యుటిలీటీ చార్జీలను చెల్లించలేమని చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు.  దీంతో జాతీయ రహదారుల సంస్థ ఈ పనులను పెండింగ్ లో పెట్టిందని.. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. తాను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి రూ. 363.45 కోట్ల రూపాయలను చెల్లిస్తామని కేంద్రానికి లేఖ రాసి.. స్వయంగా ఢిల్లీకి వెళ్లి గడ్కరీతో, జాతీయ రహదారుల సంస్థ ఛైర్మన్ తో చర్చించి విషయాన్ని వివరించి పనులను తిరిగి గాఢిలో పెట్టామని చెప్పారు. మా నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించిన నితిన్ గడ్కరి ఒక అడుగు ముందుకేసి మేమే యుటిలిటీ చెల్లిస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగిచిందని మంత్రి వివరించారు.