BRS Party News: తెలంగాణలో ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఇటీవల నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభ తర్వాత మరో సభను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత నల్గొండలో తొలి సభ పెట్టగా.. తాజాగా రెండో సభను హైదరాబాద్ లో నిర్వహించాలని చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు మార్చి రెండో వారంలో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఆలోపే త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర పోరు చేయనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి పోరు యాత్రను బీఆర్ఎస్ మొదలు పెట్టనుంది. ఇటు కృష్ణా.. అటు గోదావరి నుంచి బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర ఉండనుంది. అందులోభాగంగా కాళేశ్వరం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి పోరు యాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణలో నీటిపారుదల అంశంపై ఇటీవల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా ఇరు పార్టీల నాయకులు పరస్ఫర ఆరోపణలు చేసుకున్నారు. దీనిపైనే బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ తాను పదవి దిగిపోయాక తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులను క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇప్పుడు మరో సభ హైదరాబాద్‌లో నిర్వహించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో యాక్టివ్‌ అవుతున్నట్లు ఈ యాత్ర ద్వారా తెలుస్తోంది. నల్గొండ సభ సక్సెస్‌తో​ జోష్‌లో​ ఉన్న బీఆర్‌ఎస్‌.. ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.