Praja Bhavan Rash Driving Case: తెలంగాణలలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మరిన్ని చిక్కుల్లో పడుతున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్న సోహెల్ ఇప్పుడు విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కోసం లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. 


దుబాయ్ పారిపోయిన సోహెల్


ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అందుకే సోహెల్ కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఘటన జరిగిన తర్వాత ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. మూడు రోజుల నుంచి ప్రయత్నించా ఫలితం లేకపోయింది. చివరకు పారిపోయినట్టు తేల్చారు. అందుకే లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. 


ప్రజాభవన్ వద్ద బీభత్సం


షకీల్ తనయుడు సోహెల్‌ హైదరాబాద్ ప్రజా భవన్‌ వద్ద శనివారం (డిసెంబర్ 23) అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఓ బీఎండబ్ల్యూ కారుతో అక్కడ ఉన్న బారికేడ్లను తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపోమని చెప్పి పంపించాడు. అయితే సీసీ టీవీ ఫుటేజ్‌తోపాటు స్థానికులను విచారించిన పోలీసులు డ్రైవింగ్ చేస్తుంది డ్రైవర్ కాదని సోహెల్ అని గుర్తించారు. 


ఎమ్మెల్యే కుమారుడిని తప్పించాలని ప్రచారం


కారు బీభత్సం సృష్టించిన ఘటనలో సోహెల్‌  పేరును నిందితుల జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడ్ని తప్పించారని ప్రచారం ఉన్నందున స్వయంగా డీసీపీ దీనిపై వివరణ ఇచ్చారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. మిగతా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి సాహెల్‌ ఒకరి మృతికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.


కారులో ఐదుగురు


ప్రజాభవన్ ఎదురుగా రోడ్డుపై న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఉన్నాయని, వాటిని అతివేగంగా వచ్చి అతను కారుతో ఢీకొన్నాడని వివరించారు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు. వీళ్లంతా కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పారు. 


డ్రైవర్‌పై  నెట్టే ప్రయత్నం


అయితే, ఈ కేసు నమోదు సమయంలో అసలు నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యేను మరొకరి పేరును చేర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. కానీ, ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారని చెప్పారు. మరో యువకుడిని పట్టుకున్నారు. అతడిని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి.. మద్యం తాగలేదని గుర్తించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే ఆదేశంతో తన కుమారుడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే కారును డ్రైవ్ చేసినట్లుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. అసలు నిందితుణ్ని తప్పించడం కోసం డ్రైవర్ ను లొంగిలోపోయేలా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబరు 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అత్యంత వేగంతో ఓ బీఎండబ్ల్యూ కారు (TS 13 ET 0777) ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అడ్డుగా ఉంచిన బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వాహన వేగానికి కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది.


కేసులో పోలీసుల నిర్లక్ష్యం 


ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రమాదం తర్వాత సోహెల్‌ను పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరులు వచ్చి సోహెల్‌ను విడిపించుకొని వెళ్లారని  అంటున్నారు. ఈ దృశ్యాలన్నింటినీ చూసిన ఉన్నతాధికారులు సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు.