Covid19 Positive Cases In Telangana : తెలంగాణలో కరోనా ( Covid ) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లోనే కొత్తగా 8 పాజిటివ్ కేసులు (Positivi Cases) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,333 కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేశారు. 8 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం 59 మంది చికిత్స తీసుకుంటుండగా, నలుగురు కొలుకున్నారు. మరోవైపు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసులు (Covid 19 Cases in India) 4వేల మార్కును దాటాయి. కొత్త ఉపరకం జేఎన్‌.1 కేసులూ (JN1 Variant Cases) పెరుగుతున్నాయి. కొత్త ఉపరకం జేఎన్‌.1 కేసులు వందకు చేరువయ్యాయి.  అయితే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరగటం లేదని, దాని బారిన పడినవారిలో 92 శాతం మంది ఇంట్లో ఉండే చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కేసులు ఎక్కువగా కేరళలోనే నమోదవుతున్నాయి. 


మరోవైపు కేంద్రం ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష కూడా నిర్వహించింది. అందరూ దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి. సాధారణంగా కొవిడ్‌-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్‌ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు. ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల ద్వారా జేఎన్‌.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చు. వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ఫ్లుయెంజా లైక్‌ ఇల్‌నెస్‌, సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్‌ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్‌ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి.


మిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 లక్షణాలు
జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి మిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలోనూ కొవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు ఉంటున్నాయి. న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలూ చేస్తున్నారు.  కరోనా వైరస్‌ కారణంగా న్యుమోనియా సోకుతోందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.