Cricket Tickets Issue: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా ఈనెల 25వ తేదీన జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తోపాటు మ్యాచ్ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకున్న ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్‌ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. ప్రధానంగా హెచ్‌సీఏపై టికెట్‌ నిర్వాహణ, బ్లాక్‌లో విక్రయించారన్న ఆరోపణలపై సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమేనని గాయపడిన వారితో పాటు పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే గాయపడ్డ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తొక్కిసలాటపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. 
హైదరాబాద్ జింఖానా ఘటనపై తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ భారత్-ఆసీస్ టీ20 టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. నిర్వాహకులు ఇష్టానుసారం ఉంటామంటే కుదరదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. "టికెట్స్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  మ్యాచ్ టికెట్ల కోసం లక్షల మంది యువకులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. అనుకోకుండా జింఖాన గ్రౌండ్స్ లో తోపులాట జరిగింది. జింఖాన గ్రౌండ్స్ ఘటనలో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తాం. తెలంగాణ, హైదరాబాద్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మ్యాచ్ ఘనంగా నిర్వహిస్తాం మరిన్ని మ్యాచ్ లు వచ్చే విధంగా కృషి చేస్తాం. భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు జరగకుండా చూస్తాం. హెచ్సీఏ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఘటన జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం."- మంత్రి శ్రీనివాస్ గౌడ్ 


అసలేం జరిగిందంటే..? 
హైదరాబాద్ లో జరగనున్న భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ హంగామాతో నగరంలోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. వీరిలో ఓ మహిళకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిపై లాఠీచార్జి చేశారు. దీంతో దాదాపు 20 మంది వరకూ క్రికెట్ అభిమానులు కింద పడిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. గురువారం రోజు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. జింఖానా గ్రౌండ్ వద్ద అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.


గాయపడ్డ 20 మంది.. 
వచ్చే ఆదివారం (సెప్టెంబరు 25) ఉప్పల్‌ వేధికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ టికెట్లను సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో హెచ్‌సీఏ విక్రయిస్తుంది. దీంతో అభిమానులు పెద్ద సంఖ్యలో జింఖానా గ్రౌండ్ కు తరలివచ్చారు. క్యూలో ఉన్న క్రికెట్ అభిమానులు ప్రధాన గేటు నుంచి ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో దాదాపు 20 మంది స్పృహ తప్పిపోయారు.