Serial Actor Manoj: భార్యాభర్తల మధ్య గన్ ఫైర్ కు కారణం అయింది. మరొకరితో సహజీవనం చేస్తున్న తన భార్య వద్ద కుమార్తెను తెచ్చుకోవడానికి వెళ్లిన ఓ భర్తపై... ఆమె ప్రియుడు, సీరియల్ నటుడు మనోజ్ ఎయిర్ గన్ తో బెదిరించాడు. గాల్లోకి కాల్పులు జరుపుతూ నానా రచ్చ చేశాడు. ఎలాగోలా తప్పించుకొని వెళ్లిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 49 ఏళ్ల సిద్దార్థ దాస్ కు ఒఢిశాలోని బరంపూర్ కు చెందిన 43 ఏళ్ల స్మితాదాస్ తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 17 ఏళ్ల వయసున్న కుమారుడు, 13 ఏళ్లున కుమార్తె ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. స్మిత విడాకులు కావాలంటూ 2019లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిల్లలతో పాటు తాను వేరే చోట ఉంటానని... అక్కడకు తన భర్తని రానీయకుండా చూడాలంటూ కోర్టును కోరింది. ఆదేశాలను కూడా తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఇద్దరు పిల్లల్ని తన వందే ఉంచుకొని చూసుకుంటుంది స్మిత. ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి స్మితాదాస్ కౌన్సిలింగ్ ఇచ్చేది. 


ఈక్రమంలోనే శంభో శివ శంభో, వినాయకుడు చిత్రాల్లో నటించిన 39 ఏళ్ల మనోజ్ కౌన్సిలింగ్ తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతడు.. ఒత్తిడి భరించలేక స్మితాదాస్ వద్ద కౌన్సిలింగ్ కు వచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. అయితే గత మూడేళ్లుగా వీరిద్దరూ శామీర్ పేటలోని సెలబ్రిటీ విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవలే వీరిద్దరూ కలిసి విజయవాడలో ఓ కార్యాలయం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మనోజ్... తననూ, తన చెల్లిని ప్రతిరోజూ కొడుతున్నాడని, తీవ్రంగా వేధిస్తున్నాడని స్మితా దాస్ కుమారుడు జూన్ 12వ తేదీన బాలల సమరక్షణ కమిటీని ఆశ్రయించాడు. తల్లి వద్ద కానీ, వారి బంధువుల వద్ద కానీ ఉండనంటూ చెప్పాడు. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని సంరక్షణ గృహానికి తరలించారు. అయితే ఈనెల 18వ తేదీన బాలికతో కలిసి స్మితాదాస్ విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులు పంపించారు. 


ఇదే విషయాన్ని బాలుడు.. విశాఖలో ఉన్న తన తండ్రి సిద్దార్థ్ దాస్ కు ఫోన్ చేసి చెప్పాడు.  ఏం జరుగుతుందో తెలుసుకున్న తండ్రి వెంటనే తన కూతురును కాపాడుకోవాలనుకున్నాడు. వెంటనే హైదరాబాద్ చేరుకొని.. స్మితా ఉంటున్న శామీర్ పేటలోని నివాసానికి వచ్చాడు. అయితే ముందుగానే నిద్రలేచిన స్మిత విషయం గుర్తించి మనోజ్ కు తెలిపింది. వెంటనే తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తీసుకొని మనోజ్ బయటకు వచ్చాడు. చంపేస్తానంటూ సిద్ధార్థ వెంట పడ్డాడు. గాల్లోకి కాల్పులు కూడా జరిపాడు. అయితే స్థానికుల సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఎయిర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్, స్మిత ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎయిర్ గన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. స్మిత కూతురిని మేడ్చల్ జిల్లా బాలల సంరక్షమ కమిటీ అధికారులు ప్రభుత్వ గృహానికి తరలించారు.