Hyderbad News: తెలంగాణలో నేరాల నియంత్రణకు హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలు ఇంటిగ్రేట్ చేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్న సీసీ కమెరాల నిర్వహణలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. 


ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ఇన్‌ఫర్మేషన్ తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కు చెందిన మసూద్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఓ అప్లికేషన్ పెట్టారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న సీసీ కెమెరాలు ఎన్ని అని అందులో ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు నలభై శాతం సీసీ కెమెరాలు పని చేయడం లేదని స్పష్టం చేశారు.    


బాంబు పేలుళ్లు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దుండగులను గుర్తించడం పోలీసులకు చాలా సులువుగా ఉంటుంది. అందుకే చాలా వరకు చిన్న చిన్న పల్లెల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పటు చేస్తున్నారు. కానీ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో 40 శాతం పని చేయడం లేదనే వార్త ఆందోళన సృష్టిస్తోంది.


హైదరాబాద్ మొత్తంగా 10597 సీసీ కెమెరాలు ఉండగా.. అందులో 4402 కెమెరాలు పనిచేయడం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఆర్టీఐ అప్లికేషన్‌ను షేర్ చేస్తున్న వారంతా హైదరాబాద్‌ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదారబాద్‌లో చోరీలు పెరిగిపోయాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొందరు, పబ్లిక్ ఎక్కువగా ఉన్న బస్టాండులు, రైల్వే స్టేషన్లలో విపరీతంగా చోరీలు చేస్తున్నారు.  


గత వారంలో హైదరాబాద్ సిటీలో ఆరుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొద్దుపొద్దున రెండుచోట్ల గొలుసులు లాక్కెళ్లారు. మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్ కాలనీలోనూ ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు వెంబడించినా దొరకకుండా పారిపోయాడు. ఈ కేసులు ఛేదించడానికి పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు.  


నాలుగు నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ జంట.. పంజాగుట్ట పరిధిలోని ఓ షాపింగ్ మాల్ కు వెళ్లింది. తనకు నచ్చిన బట్టలన్నీ సెలెక్ట్ చేసుకుంది. వాటిని ట్రయల్ చేసేందుకని.. ట్రయల్ రూంలోకి వెళ్లింది. వాటిని మార్చుకునే క్రమంలో మెడలో ఉన్న తాళి బొట్టు తీసి పక్కన పెట్టింది. తనకు కావాల్సిన బట్టలన్నీ ట్రై చేసి నచ్చిన వాటిని తీసుకని వెళ్లిపోయింది. కానీ మెడలోంచి తీసిన తాళిని మాత్రం మరిచిపోయింది. ఇంటికి వెళ్లాక తాళి విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగుపరుగున మళ్లీ షాపింగ్ మాల్ కి వచ్చింది. కానీ ఆమె ట్రయల్ చేసిన రూంలోకి వెళ్లే సరికి ఆ తాళిబొట్టు అక్కడ లేదు. అదే విషయాన్ని షాపింగ్ మాల్ సిబ్బందికి తెలిపింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. అక్కడ కూడా సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో మహిళ తన తాళిబొట్టును కోల్పోయింది. 


మొన్నీమధ్య నాగోల్‌ పరిధిలో ఓ బంగారం దుకాణంలో కొందరు దుండగులు చోరీ చేశారు. అక్కడ కూడా సీసీ కెమెరాలతోనే కేసును పోలీసులు ఛేదించారు. ప్రాథమికంగా అక్కడ కూడా కొన్ని సీసీ కెమెరాలు పని చేయలేదని తేలిసింది. అందుకే చాలా సీసీ కెమెరాలు పరిశీలించాల్సి వచ్చిందని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. 


రోజురోజుకు నేరాల సంఖ్య పెరుగుతున్న వేళ సీసీ కెమెరాల పనితీరుపై దృష్టి పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు బాగు చేయిస్తే.. నగరంలో నేరాల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.